Kavitha Janam Bata: ఎమ్మెల్సీ కవిత మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనను బయటికి పంపించి పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్కు లేదని వ్యాఖ్యానించారు. అలాంటిది ఉంటే ఆయనే మీడియా ముందు చెబుతారంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని అంశం ఆధారంగా విమర్శిస్తానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, ఆ పార్టీ వాళ్లు తనకు మద్దతు ఇవ్వటమేంటీ? అని కవిత ఎద్దేవా చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె నిజామాబాద్లో ప్రెస్ మీట్లో మాట్లాడారు. ‘‘అవకాశం, అధికారం, ఆత్మగౌరవం మా విధానం. సామాజిక తెలంగాణ సాధన ద్వారానే ఇది సాధ్యం. తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ మంచి జరగాలనే జనం బాట కార్యక్రమం. ప్రజల సమస్యలు తీరడం ముఖ్యం. అవసరమైతే రాజకీయ పార్టీ పెడతాం’’ అని ఆమె చెప్పారు. నిజామాబాద్లో తనను ఎమ్మెల్యేలే ఓడించారని కవిత పునరుద్ఘాటించారు.
Read Also- Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?
ఎన్నో ఉద్యమాలు చూశాం
‘‘మనం ఎన్నో విప్లవాలను చూశాం. వాటిలో కొన్ని మాత్రమే గమ్యాన్ని ముద్దాడాయి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యింది. జాగృతి జనం బాట ఎందుకంటే? అవకాశం, అధికారం, ఆత్మగౌరవం అనే విధానం మాది. ఇది అర్థంకాని కాన్సెప్ట్ ఏమీ కాదు. ఇప్పుడు విద్య అందరికీ అందుబాటులో లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు. దాంతో నష్టపోయేది ఎవరు?
ఆడబిడ్డలు మాత్రమే. ఫీజు కట్టాల్సి వస్తే తల్లితండ్రులు మగ పిల్లలకు ఫీజు ఇస్తారు. ఆడవాళ్లకు ఇవ్వరు. ఈ విధంగా ఆడబిడ్డలకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు. అందరికీ సమాన అవకాశాలు లేకుండా ప్రభుత్వమే అణిచి వేస్తోంది. అదే విధంగా అధికారంలో వాటా దక్కాలి. ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ అధికారంలో వాటా కొన్ని వర్గాలే అనుభవిస్తున్నాయి. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే సామాజిక న్యాయం జరగాల్సిందే. అధికారంలో మహిళల వాటా 5 శాతం కూడా లేదు. కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు భాగస్వామ్యం లేదు. అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరముంది. మైనార్టీల పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ మైనార్టీ మంత్రి లేని మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. మైనార్టీ, ఎస్టీ మంత్రి లేని ప్రభుత్వం. కాంగ్రెస్ సిగ్గుతో తలదించుకోవాలి’’ అని కవిత విమర్శల దాడి చేశారు.
Read Also- Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది
అందరి కోసం మాట్లాడుతున్నా..
తాను ఒక్క బీసీలు, ఎస్సీ, ఎస్టీల కోసమే మాట్లాడటం లేదని, తెలంగాణలోని అందరి కోసం మాట్లాడుతున్నానని ఎమ్మెల్సీ కవిత అననారు. ‘‘ రిజర్వేషన్లు, అవకాశాలు, ఉపాధి విషయంలో సమానత్వం కోసం ప్రభుత్వాలు ఆలోచించాలి. గ్రూప్ -1 విషయంలో తెలంగాణ యువతకు అన్యాయం చేసి 8 మంది నాన్ లోకల్కు ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశాను. ఆయన సుమోటోగా కేసు విచారణ చేపట్టక పోతే రిట్ పిటిషన్ దాఖలు చేస్తాం. ఆ 8 మంది గ్రూప్ -1 స్థాయిలో ఉండి 30 ఏళ్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దాంతో తెలంగాణకు నష్టం జరుగుతుంది. వారందరినీ ఆపే వరకు పోరాటం చేస్తాం. యువతకు జరిగిన నష్టంపై మాట్లాడతాం’’ అని కవిత పేర్కొన్నారు.
