Phone Tapping Case: ఆ వివరాలు ఇవ్వాల్సిందేనని ప్రభాకర్ రావుకు ‘సుప్రీం’ ఆదేశాలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping Case) మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తన ఐఫోన్, ఐక్లౌడ్ పాస్వర్డ్లను దర్యాప్తు అధికారులకు ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ బాగోతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేసులు నమోదు అవ్వగా, ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతోపాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులు అరెస్టు కూడా అయ్యారు. వీరిని విచారించగా వెల్లడైన వివరాలతో సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రధాన నిందితునిగా చేర్చారు. దాంతోపాటు ఓ ఛానల్ యజమాని శ్రవణ్ రావును 6వ నిందితుడిగా పేర్కొన్నారు.
Read Also- Coldref Syrup Deaths: తెరవెనుక కథ.. దగ్గు సిరప్ ‘కోల్డ్రిఫ్’పై ఎంత కమిషన్ ఇస్తారో చెప్పేసిన డాక్టర్
కాగా, కేసులు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించి దర్యాప్తు అధికారులు ప్రభాకర్ రావును వెనక్కి రప్పించారు. అయితే, రావటానికి ముందు ప్రభాకర్ రావు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది. అయితే, విచారణ ముగిసే వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర రక్షణ కల్పించింది. అదే సమయంలో విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సిట్ అధికారులు పలుమార్లు నోటీసులు ఇవ్వటం ద్వారా ప్రభాకర్ రావును పిలిపించి ప్రశ్నించారు. అయితే, విచారణలో ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించక పోవటంతో సుప్రీం కోర్టుకు అదే విషయాన్ని తెలియజేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాకర్ రావుకు కల్పించిన మధ్యంతర రక్షణను తొలగించి కస్టోడియల్ ఇంటరాగేషన్కు అనుమతించాలని కోరారు. దీనిపై మంగళవారం సుప్రీం కోర్టు జడ్జిలు జస్టిస్ బీ.వీ.నాగరత్నం, జస్టిస్ ఆర్.మహదేవన్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
Read Also- EPFO New Rules: ఈపీఎఫ్వో అదిరిపోయే గుడ్న్యూస్! ఉద్యోగులు ఫుల్హ్యాపీ!
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వం మారగానే ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రూంలోని కంప్యూటర్ల హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్టుగా చెప్పారు. అక్కడ కొత్తగా యాభై డిస్కులను పెట్టారన్నారు. మావోయిస్టుల పేర రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. డేటా మొత్తం డిలీట్ చేసిన తరువాత కొన్ని డివైస్ లను దర్యాప్తు అధికారులకు ఇచ్చారని తెలిపారు. ఇక, ప్రభాకర్ రావు తన మొబైల్ ఫోన్లను కూడా ఫార్మాట్ చేశారని చెప్పారు. ఐ ఫోన్, ఐ క్లౌడ్ పాస్ వర్డ్ లను ఇవ్వటం లేదన్నారు. ఈ క్రమంలోనే అతనికి కల్పించిన మధ్యంతర రక్షణను తొలగించి కస్టోడియల్ ఇంటరాగేషన్ కు అనుమతించాలని అభ్యర్థించారు. ఇక, ప్రభాకర్ రావు తరపున వాదనలు వినిపించిన న్యాయవాది శేషాద్రి నాయుడు డివైస్ లను రీసెట్ చేసేందుకు తన క్లయింట్ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ధర్మాసనం ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్ వర్డ్ ను రీసెట్ చేయాలని ఆదేశించింది. రీసెట్ చేసిన తరువాత డేటాను డిలీట్ చేశారని తేలితే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. వచ్చే నెల 18వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ అప్పటివరకు ప్రభాకర్ రావుకు కల్పించిన మధ్యంతర రక్షణ కొనసాగుతుందని పేర్కొంది.
