- గొర్రెల పంపిణీ స్కామ్ దర్యాప్తు వేగవంతం
- పెద్ద ఎత్తున జరిగిన నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు
- కీలక సూత్రధారి పాత్ర బయటకొచ్చే ఛాన్స్
- సంబంధిత శాఖకు చెందిన అమాత్యునిపై అనుమానాలు
- త్వరలోనే విచారణ జరపనున్న అధికారులు
- బీఆర్ఎస్ పార్టీ పెద్దల ప్రమేయంపైనా ఆరా..
- కాంట్రాక్ట్ ఏజెన్సీలనూ వదలని అధికారులు
- దర్యాప్తు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన సీఎం రేవంత్
ED enquires in Sheep scam case suspect on concerned minister role:
బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే పశుసంవర్థక శాఖ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి ప్రశ్నించడం జరిగింది. ఇక పైస్థాయి అధికారులు వారి వెనక ఉన్న కీలక వ్యక్తుల పేర్లు బయటకు రానున్నాయి. ఈ కుంభకోణంలో 700 కోట్ల మేరకు అవినీతి జరిగిందని, పెద్ద మొత్తం డబ్బు చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఓ అమాత్యుని పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. త్వరలోనే ఆ మంత్రిని విచారణ చేయబోతున్నట్లు సమాచారం.
కీలక వివరాలివ్వాలని కోరిన ఈడీ
గొర్రెల పథకానికి సంబంధించిన పూర్తి విరాలు ఇవ్వాలని పశుసంవర్థక శాఖ అధికారులకు ఈడీ లేఖ రాసింది. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదాుల వివరాలు, గొర్రెల కొనుగోలు కోసం ఏ బ్యాంకు ఖాతాలలో జమ అయింది. అధికారులు ఎంత జమచేశారు వంటి కీలక వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు గొర్రెల రవాణాలో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఏజెన్సీల వివరాలు అసలు ఈ కుంభకోణానికి కారకులు ఎవరు, సూత్రధారి ఎవరు, పాత్రదారులు ఎవరు, రికార్డులలో తప్పుడు లెక్కలు వంటి వివరాలను సేకరించే పనిలో ఉంది ఈడీ.
ఇప్పటికే కీలక వ్యక్తుల అరెస్టులు
రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈవో, గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ రాంచందర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ లను ఇప్పటికే అరెస్టు చేశారు. వీరు ఈ కుంభ కోణానికి కారకులు ఎవరు.. ఎవరెవరి పాత్ర ఉంది.. రికార్డ్స్ లో తప్పుడు లెక్కలపై వారి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. గొర్రెలు అమ్మిన రైతుల ఖాతాలకు కాకుండా ఇతర బినామీల ఖాతాలకు డబ్బు మళ్ళింపుపై వివరాలుసేకరిస్తున్నారు.
ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్
మనీలాండరింగ్ జరిగిందని ఈడీకి ఈ కేసులో ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. స్వచ్చందగా తెలంగాణ ఏసీబీ పోలీసులు నమోదు చేసిన కేసులో ఈడీ వివరాలు అడిగిందంటేనే ఓ సంకేతం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయవర్గాలంటున్నాయి. స్కాం జరిగినప్పుడు సంబంధిత మంత్రిగా ఉన్న ఆయన దగ్గరకే కేసు వెళ్తుందన్న చర్చ జరుగుతోంది. అరెస్టు అయిన ముగ్గురు వెల్లడించిన అంశాలతో త్వరలో మరికొందర్ని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.