*ఎంపికలో రేవంత్ (CM Revanth Reddy) మార్క్
*వివాదాలున్నా మాస్ లీడర్గా గుర్తింపు
*వ్యతిరేకతే అనుకూల నిర్ణయాలు
*ఎంఐఎంతోపాటు అందరినీ కలుపుకుని పోయే యువ లీడర్
*గెలుపే దిశగా పావులు
Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఉన్నిక (Jubilee Hills By-Election)కు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ (Naveen Yadav) పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. ఇన్నిరోజులు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నా అదృష్టం మాత్రం నవీన్ను వరించింది. అనేక సర్వేలు, చర్చల అనంతరం అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నది. నవీన్ యాదవ్ స్థానిక యువ నేత కావడంతో ఈ ఎంపికపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గానికి చెందిన స్థానిక నేతగా, అన్ని వర్గాలకు సుపరిచితుడిగా ఈయనకు గుర్తింపు ఉన్నది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతగా బీసీ వర్గాల్లో పట్టుంది. అంతేకాకుండా నియోజకవర్గంలో మెజారిటీ ఉన్న ముస్లిం వర్గాలు కూడా తమ వాడిగా భావిస్తున్నట్టు సర్వేల్లో తేలింది. అందుకే అన్ని కోణాల్లో పరిశీలన చేసి కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను ఎంపిక చేసింది.
విజయం ఖాయం అంటూ హర్షాతిరేకాలు
నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే, వివిధ వర్గాల ప్రజలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారని, ఈ ప్రాంత అభివృద్ధికి మరింతగా పాటుపడతారని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జూబ్లీహిల్స్లో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, రహదారుల మెరుగు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. దీనికి తోడుగా ఇప్పుడు స్థానికంగా ప్రజల సమస్యలు తెలిసిన, ప్రజల మనసెరిగిన నాయకుడిగా నవీన్ యాదవ్ నియోజక వర్గానికి మరింత మేలు చేస్తారని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడంతోనే అధికార పార్టీ గెలుపు ఖరారైందని పేర్కొంటున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నవీన్ యాదవ్ అభివృద్ధి పథంలోకి తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read- Gatha Vaibhava: పవన్ కళ్యాణ్ అద్భుతమైన మాట చెప్పారు.. అందుకే తెలుగు నేర్చుకుని వచ్చానన్న హీరో!
సేవా కార్యక్రమాలతో విస్తృతంగా ప్రజల్లోకి..
నవీన్ యాదవ్ కేవలం యువ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, సామాజిక కార్యకర్తగా, నిస్వార్థ సేవకుడిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 2009లోనే నవ యువ ఫౌండేషన్ను స్థాపించి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, మహిళలు, మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. కోవిడ్ సమయంలో దగ్గరుండి ప్రజల అవసరాలను తీర్చారు. 2008లో 500 మందికి ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇప్పించారు. వారిలో 40 మంది ఉద్యోగాలు సాధించారు. నిత్యం యువతకు ఎస్ఐ, కానిస్టేబుల్ కోచింగ్ ఇప్పిస్తూ పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇటీవల 2,000 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం, 1000 మంది చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇది ఇండియన్, లిమ్కా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. నిత్యం సామూహిక వివాహాలు చేయించడం నవ యువ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో ఒక భాగం. జూబ్లీహిల్స్లో ముస్లిం మైనారిటీలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న స్మశాన వాటికకు ఎర్రగడ్డలో స్థలాన్ని కేటాయించగలిగారు. యూసుఫ్గూడలో సిక్కుల శ్మశాన వాటిక కోసం ఉద్యమించి స్థలం కేటాయించగలిగారు. ఇది తెలంగాణలోనే సిక్కుల కోసం ఏర్పాటు చేసిన మొదటి స్మశాన వాటిక. కోవిడ్ సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలకు పెద్దఎత్తున నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇటీవల ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం కింద 5 వేల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి వారి ఆర్థిక స్వావలంబనకు నవీన్ యాదవ్ కృషి చేశారు. ఇలా నిత్యం తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానికంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడినా కూడా నియోజకవర్గ ప్రజలను వీడకుండా నిత్యం వారికి అందుబాటులో ఉంటూ స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. తద్వారా ఆయన జూబ్లీహిల్స్లో అన్ని వర్గాల ప్రజల్లో మాస్ లీడర్గా గుర్తింపు సంపాదించగలిగారు.
స్వయం కృషితో ఎదిగిన నాయకుడు
రాజకీయంగా నవీన్ యాదవ్ స్వయం కృషితో ఎదిగిన నాయకుడు. 2014లో ఎంఐఎం టికెట్పై జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి 41,656 ఓట్లు (25.19%) సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. ఈ ఫలితాలు నియోజకవర్గంలోని బీసీలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఆయనకున్న ఆదరణకు నిదర్శనంగా నిలిచాయి. అనంతరం 2023 నవంబర్ 15న అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీసీలకు పెద్దపీట వేయాలనే నవీన్ అభ్యర్థిత్వం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అగ్ర వర్ణాలకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వారందరినీ కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ బీసీ నేతను ఎంపిక చేసింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా ఉన్నది. ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కృషి చేస్తున్న సీఎం, ఈ ఉప ఎన్నికలోనూ బీసీ అభ్యర్థిని ప్రకటించి ఆయా వర్గాల సాధికారతలో తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తరువాతే, ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఉప ఎన్నికల బరిలో దింపినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు నవీన్ యాదవ్ను తమవాడిగా భావిస్తుండడం వల్లే ఆయనకు టికెట్ కేటాయించడానికి కారణమైంది. ఇక, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ, ఎంఐఎంలు పోటీ నుంచి తప్పుకున్నాయి. మిగిలిన బీజేపీ టికెట్ ఎవరికి ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
