Current Bill Is Rs 21 Crores The House Owner Is Shocked: సాధారణంగా ఓ కుటుంబం నివసించే ఇంటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. రెండు బల్బులు, ఫ్యాన్లకు కలుపుకొని మహా అయితే ఐదు వందల వరకు వస్తుంది. ఇక వారి వినియోగం కొద్దిగా ఎక్కువైతే రూ. 5 వేల వరకు కరెంట్ బిల్లు వస్తుంది. ఏసీలు, కూలర్లు, ఎలక్ట్రిటిక్ పరికరాలు ఎక్కువయితే ఎంత లేదన్నా నెలకు రూ. 10 వేల వరకూ వస్తుంది. కానీ, ఓ వ్యక్తి ఇంటికి ఎంత కరెంటు బిల్ వచ్చిందో తెలిస్తే నిజంగానే మీరంతా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ ఇంటి యజమానికి రాష్ట్రానికి రావాల్సిన బిల్లు వచ్చింది. ఇక కరెంట్ బిల్లు చూసిన ఆ యజమానికి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినంత పనయ్యింది. ఆ ఇంటికి ఒక్కనెల కరెంటు బిల్లు రూ.21 కోట్లు వచ్చింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్లో జరిగింది.
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బిజినేపల్లి మండలం ఖానాపురానికి చెందిన వేమారెడ్డి ఇంట్లో ఉన్న సర్వీస్ నెంబర్ 1110000 51 మీటర్ కేవలం 0.60 కిలోవాట్కు సంబంధించింది. అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో వందల్లో రావాల్సిన కరెంటు బిల్లు కాస్త ఏకంగా కోట్లల్లో వచ్చింది. దీంతో ఆ ఇంటి యజమాని కాస్త ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. 01-01-1970 నుంచి 05-06-2024 వరకు 998 రోజుల పాటు 297 యూనిట్లు వినియోగించినట్టు, అందుకు రూ.21,47,48,569 కరెంట్ బిల్లు వచ్చినట్టు ఈ నెల 5న వినియోగదారుడికి ఇచ్చిన బిల్లులో ఉంది. దాంతో బిల్లు అందుకున్న వేమారెడ్డి ఒకింత షాక్కు గురయ్యాడు. అయితే ఇదేందని ట్రాన్స్కో సిబ్బందిని ప్రశ్నించగా, వారు అధికారులకు ఫిర్యాదు చేశారు.
Also Read:హెల్త్ ల్యాబ్.. వాహనాలొస్తున్నాయి
అప్పుడప్పుడు సాంకేతిక లోపం కారణంగా బిల్లులు ఎక్కువగా వచ్చాయని ట్రాన్స్కో ఏఈ తెలిపారు. కేవలం వేమారెడ్డికి మాత్రమే కాకుండా అదే గ్రామంలో మరో పది మందికి కూడా ఈ తతంగం ఎదురైంది. కరెంట్ బిల్లు అందరికి ఇలాగే కోట్లలో వచ్చిందని తేలింది. దీంతో కరెంట్ బిల్లు వ్యవహారం కాస్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి వైరల్ అవుతోంది. ఇక, ఈ విషయంపై స్పందించిన ఏఈ సాంకేతిక లోపం కారణంగా బిల్లులు ఎక్కువ వచ్చిన మాట నిజమేనని అన్నారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకు బిల్లులను వెంటనే సరిచేశామని ఆయన వివరణ ఇచ్చారు. ఇక ఇది చూసిన జనాలు ఏందయ్యా ఇది ఒక్క ఇంటికి ఇంత బిల్లు వస్తే మాలాంటి మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ప్రజలు కోరారు.