- కొత్త రేషన్ కార్డులపై కసరత్తు మొదలు పెట్టిన సర్కార్
- మహిళా సంఘాలకు ఇంటింటి సర్వే బాధ్యతలు
- ఇంటింటి సర్వే ద్వారా లబ్దిదారుల గుర్తింపు
- అధికారికంగా ప్రకటన రాకుండానే మహిళా సంఘాల అత్యుత్సాహం
- ఇప్పటికే గ్రామాలలో మొదలుపెట్టిన ఇంటింటి సర్వే
- దరఖాస్తు చేసిన ప్రతి ఇంటికీ వెళ్లాలని మహిళా సంఘాలకు ఆదేశం
- ఊళ్లల్లో అప్లై చేసుకున్న దరఖాస్తుదారులు
- సిటీలో నివాసం అడ్రెస్ ఒకచోట..ఉద్యోగం మరో చోట
- సమాచార సేకరణ కష్టంగా మారిందంటున్న మహిళా సంఘాలు
T government begins white ration cards issue survey with women group :
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను విజయవంతంగా పూర్తిచేసే పనిలో తెలంగాణ సర్కార్ నిమగ్నమయింది. పార్లమెంట్ ఎన్నికల ముందే కొన్ని కీలక హామీలు అమలు చేయగా మిగిలిన హామీలు ఎన్నికల కోడ్ రావడంతో పెండింగ్ లో ఉండిపోయాయి. ఇప్పుడు కోడ్ ఎత్తివేయడంతో మిగిలిన హామీలు అమలుచేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగానే కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అర్హులకే రేషన్ కార్డులను జారీ చేసే విషయంలో క్షేత్ర స్థాయిలో అప్లికేషన్ల ఫిల్టర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. సివిల్ సప్లై అధికారుల ఆదేశాలతో అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గ్రేటర్ పరిధిలోకి వచ్చే మూడు జిల్లాలలో ఇంటింటి సర్వే చేయాలని రేవంత్ సర్కార్ సివిల్ సప్లై అధికారులను ఆదేశించింది. కాగా మిగిలిన అన్ని జిల్లాలలో మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే సంబంధిత శాఖ నుంచి మహిళా సంఘాలకు ఆదేశాలు రాకుండానే కొన్ని జిల్లాలలో మహిళా సంఘాలు అత్యుత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు సమాచారం. అధికారిక ప్రకటన రాకపోయినా మౌఖిక ఆదేశాలతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతోందని తెలుస్తోంది. దీంతో గ్రామాల్లో అర్హులను తేల్చేందుకు మహిళా సంఘాల ద్వారా వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు, ధరణి తదితరాల కోసం 19,92,747 దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిగణలోకి తీసుకొని సర్వేలు చేస్తున్నారు.
అర్హుల లెక్క తేల్చేందుకు
అప్లికేషన్ పెట్టుకున్న ప్రతీ ఇంటికీ వెళ్లి సర్వే చెయ్యాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాలు, గ్రామాల్లో అర్హులు ఎవరు అన్నది తేల్చేందుకు మహిళా సంఘాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది. ఈ మహిళా సంఘాల సభ్యులు ఇళ్లకు వెళ్లి.. అప్లై చేశారా అని అడుగుతారు. ఆ తర్వాత సొంత ఇల్లు ఉందా? కారు ఉందా? సంవత్సర ఆదాయం ఎంత? ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు వేసి.. దరఖాస్తులో ఉన్న అంశాలతో పోల్చి చూస్తారు. తద్వారా.. దరఖాస్తు పెట్టుకున్న వారు పేదవారా కాదా అన్నది తేల్చుతారు. పేదవారు కాదు అని తేలితే, వారికి వైట్ రేషన్ కార్డు లేనట్లే!
సమస్యలు ఎన్నో..
రాష్ట్రవ్యాప్తంగా 12,709 గ్రామ పంచాయతీల్లో ఇంటింటి సర్వే మొదలైనట్లు తెలిసింది. ఐతే.. ఇక్కడో సమస్య ఉంది. దరఖాస్తు పెట్టుకున్న వారిలో చాలా మంది ఉపాధి కోసం గ్రామాలను వదిలి.. పట్టణాలు, సిటీల్లో స్థిరపడ్డారు. వారు ఇప్పుడు ఇంటింటి సర్వేకి అందుబాటులో ఉండరు. అందుకే వారు తమకు వైట్ రేషన్ కార్డు రాదేమో అని ఆందోళన చెందుతున్నారు. సర్వేలో తమ వివరాలు సరిగా నమోదు చేయకపోయినా, తమను లెక్కలోకి తీసుకోకపోయినా తాము నష్టపోతామని వారు అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకొని, తమకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. ఇంటింటి సర్వేకి వచ్చిన వారు, తమకు కాల్ చేసైనా వివరాలు కోరాలని వేడుకుంటున్నారు.