KTR: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎక్స్ వేదికగా శుక్రవారం ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ 2025 నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అట్టడుగున ఉండటం దారుణమన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచిక ఇదేనని పేర్కొన్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. జీఎస్టీ వృద్ధిలో ఈ పతనం.. రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఎంత విధ్వంసం పాలయ్యిందో చెప్పే ఒక నిదర్శనమని ధ్వజమెత్తారు.
‘అన్ని రంగాలూ నేలచూపులే’
గత బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం నుంచి ఐటీ వరకూ అన్ని రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి దన్నుగా నిలిచిందని ఇవ్వడంతో ఆర్థికవ్యవస్థ పరుగులు తీసి, రికార్డులు తిరగరాసిందని తెలిపారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా కూడా అన్ని రంగాలూ నేలచూపులే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం నుంచి రియల్ ఎస్టేట్ వరకూ అన్ని రంగాల్లోనూ దైన్యమే తాండవిస్తోందని మండిపడ్డారు. అవినీతి, అనుభవలేమి కలగలసిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురవుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపడానికి చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read: Dussehra Liquor Sales: దసరా వేళ ఏరులై పారిన మద్యం.. గత రికార్డులు బద్దలు.. ఇలా తాగేశారేంట్రా బాబు!
మూడ్రోజులు యూఎస్ పర్యటన
మరోవైపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడు రోజులు వ్యక్తిగత పర్యటనకు అమెరికాకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన తన కుమార్తె కాలేజీ విద్య కోసం పలు కాలేజీలను పరిశీలించనున్నట్లు సమాచారం. కేటీఆర్ తిరిగి హైదరాబాద్ కు ఆదివారం రాత్రే రానున్నారు. యథావిధిగా సోమవారం నుంచి పార్టీ కార్యకలాపాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు.
