DRF Hyderabad services spread upto Outer ring road:
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ వర్షాలు, విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని నగర పౌరులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా ఉండాలని జీహెచ్ ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ సేవలను ఔటర్ రోడ్డు పరిధి మేరకు విస్తరించాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హఠాత్తుగా భారీ వర్షాలు, వరదలు వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన వ్యవస్థను ఏర్పాటుచేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీచేశారని ఆమె స్పష్టంచేశారు. సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఇదే విషయాన్ని ఆమె తెలియజేశారు.
డిజాస్టర్ రెస్పాన్స్ విభాగం మరింత పటిష్టం
జీహెచ్ఎంసీలోని డిజాస్టర్ రెస్పాన్స్ విభాగాన్ని మరింత పటిష్టపరుస్తున్నామని, ఇందుకుగాను విపత్తులను ఎదుర్కోవడానికి అదనపు సిబ్బందిని, తగు యంత్ర పరికరాలను అందచేయనున్నట్లు శాంతికుమారి వివరించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్ల పరిధిలో 30 డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని, వీటికి తోడు మరో 15 బృందాలను అదనంగా ఏర్పాటు చేసి వీటి సేవలను ఔటర్ వరకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలున్నందున, కెమికల్ ఫైర్ ప్రివెన్షన్కు ప్రత్యేక శిక్షణతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని శాంతి కుమారి సూచించారు.
141 సమస్యాత్మక ప్రాంతాలు
హైదరాబాద్ నగరంలో 141 సమస్యాత్మక ప్రాంతాల్లో మున్సిపల్, పోలీస్, విద్యుత్, జలమండలి తదితర శాఖలు సమన్వయంతో పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాలలో కూడా డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేయడం, ఇప్పటికే ఉన్న డీఆర్ఎఫ్ బృందాలను పటిష్టపరిచే చర్యలు చేపట్టాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ విభాగంతో సమన్వయంతో పని చేయాలన్నారు. దేశంలోని ప్రధాన మహానగరాలైన ముంబయి, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరులలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాల పనితీరుపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు.