Damodar Raja Narasimha: సనత్నగర్, కొత్తపేట్, అల్వాల్ టిమ్స్ హాస్పిటళ్లను కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా తీర్చిదిద్దాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఆదేశించారు. ఏఐజీ, అపోలో, యశోద, నిమ్స్, ఎయిమ్స్ హాస్పిటళ్ల తరహాలో పరిశుభ్రత, పేషెంట్కేర్కు సమప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిమ్స్ తరహాలో టిమ్స్లలోనూ స్వయం పాలన వ్యవస్థ ఉండాలన్నారు. త్వరలో సనత్నగర్ టిమ్స్ ప్రారంభించనున్న నేపథ్యంలో, అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Also Read: RV Karnan: బల్ధియా బాస్ సంచలన నిర్ణయం.. మూడేళ్లు పూర్తయితే సీటు ఖాళీ చేయాల్సిందే!
యశోద, నిమ్స్, విధానాలపై స్టడీ
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్, ప్రొఫెసర్ విమలా థామస్ తదితరులు పాల్గొన్నారు. ఏఐజీ, అపోలో, యశోద, నిమ్స్, ఎయిమ్స్లో అవలంభిస్తున్న విధానాలపై ఇప్పటికే అధికారులు స్టడీ చేసి, నివేదిక తయారు చేశారు. ఈ నివేదికలోని అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలు పనిచేస్తున్న విధానం, డాక్టర్లు, సిబ్బంది సంఖ్య, పెడుతున్న ఖర్చు, తదితర అంశాలను మంత్రికి తెలిపారు.
నిమ్స్ కంటే మెరుగైన హాస్పిటళ్లను ప్రజలకు అందించాలి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేట్ హాస్పిటల్స్కు ధీటుగా, నిమ్స్ కంటే మెరుగైన హాస్పిటళ్లను ప్రజలకు అందించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచన అని మంత్రి తెలిపారు. ఇందుకు అనుగుణంగా అన్నిరకాల వసతులతో హాస్పిటళ్లు ఉండాలని, అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్పొరేట్ హాస్పిటళ్ల తరహాలో క్లినికల్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, అకాడమిక్స్ విభాగాలు వేర్వేరుగా ఉండాలని సూచించారు.
ఏయే విభాగానికి ఎవరు బాధ్యులు
నిమ్స్ తరహాలో మెడికల్ డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్తోపాటుగా చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ కూడా ఉండాలన్నారు. ఏయే విభాగానికి ఎవరు బాధ్యులు, ఎవరి పని ఏంటి అన్నదానిపై స్పష్టమైన జాబ్చార్ట్ ఉండాలని మంత్రి ఆదేశించారు. గతంలో ధనవంతులు, పెద్ద పెద్ద నాయకులు కూడా చికిత్స కోసం గాంధీ, ఉస్మానియాకు వెళ్లేవారని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు టిమ్స్లను ఆ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు.
వారం రోజుల్లో తుది నివేదికను తయారు చేయాలి
డాక్టర్లు, సిబ్బంది నియామకం, తదితర పూర్తి అంశాలతో వారం రోజుల్లో తుది నివేదికను తయారు చేయాలని హెల్త్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు.ఇక రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణ పై అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మెడికల్ కాలేజీల వరకు ఎక్కడా వైద్యసేవల్లో జాప్యం కాకూడదని వివరించారు. మందులు కొరత, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సమస్యలు రాకూడదన్నారు. అయితే గత సంవత్సరం తో పోలిస్తే సీజనల్ వ్యాధుల కేసులు తగ్గుముఖం పట్టాయని ఆఫీసర్లు వెల్లడించారు.
Also Read: Rajasthan Bride: శోభనం రోజున వరుడికి బిగ్ షాక్.. వధువు దెబ్బకు ఫ్యూజులు ఔట్.. ఏమైందంటే?