Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్ గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.
వరద నిలిచే ప్రాంతాలపై ఫోకస్
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాజ్ వేలను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి.. ముందస్తుగా ట్రాఫిక్ ను నిలిపివేయాలని సూచించారు. మరోవైపు విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ద తీసుకోని.. అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. వేలాడే వైర్లను తొలగించటంతో పాటు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. అటు దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని అన్నారు.
హైడ్రా, జీహెచ్ఎంసీలకు సూచన
హైదరాబాద్ లోనూ భారీ వర్షం కురిసే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ (GHMC), హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ (CM Revanth Reddy) అదేశించారు. నగర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
Also Read: TVS Bikes Price Down: టీవీఎస్ లవర్స్కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బైక్ రేట్స్.. మోడల్ వారీగా లిస్ట్ ఇదే!
సెప్టెంబర్ 30 వరకూ వర్షాలు
తెలంగాణలో సెప్టెంబర్ 30 వరకూ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంలా మారే ప్రమాదమున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్ సహా నల్గొండ, సూర్యపేట, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలో వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించింది. అదే సమయంలో వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.