- చావు తప్పి కన్ను లొట్టపోయిన బీజేపీ
- పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా తగ్గిన సీట్లు
- సొంతంగా 370 అనుకుంటే, వచ్చింది 240
- దేశవ్యాప్తంగా ఎన్టీఏకూ తగ్గిన మెజారిటీ
- బలం పుంజుకున్న ఇండియా కూటమి
- ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఆశలు గల్లంతు
- పది రాష్ట్రాల్లో ఎదురుగాలి
- కొంప ముంచిన ఉత్తరాది రైతు ఉద్యమాలు
- కాంగ్రెస్ను తక్కవ అంచనా వేసి షేక్ అయిన కమలం
Nda alliance cannot secure mejority seats Modi image not workout:
ఢిల్లీ, స్వేచ్ఛ: అంతన్నాడింతన్నాడే గంగరాజు పాటలాగా తయారయింది ఎన్డీఏ పరిస్థితి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనప్పటి నుంచి 400 సీట్లు అన్నారు. మొదటి రెండు దశల ఎన్నికల తర్వాత 360 అన్నారు. ఎన్నికలయ్యాక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం 350 నుంచి 360 వస్తాయని, వచ్చేది మోదీయే అన్ని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. ఇటు బీజేపీ శ్రేణుల అంచనాలు కూడా తలకిందులయ్యాయి. కేంద్రంలో అతికష్టం మీద ఎన్టీఏ కూటమి గట్టెక్కింది. సొంతంగానే 370 స్థానాలు గెలుచుకుంటామన్న ధీమా ఆవిరైపోయింది. ఇప్పుడు కూటమే దిక్కయింది బీజేపీ నేతలకు. సొంతంగా బీజేపీ 240కే పరమితమైంది.
బీజేపీకి కష్టకాలమేనా?
ప్రస్తుత ఎన్నికలలో ఓట్ల లెక్కింపు సరళి చూస్తుంటే బీజేపీకి కష్టకాలం రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విమర్శకులు. ఓవరాల్గా 10 రాష్ట్రాల ట్రెండ్స్లో ఆ పార్టీ చాలా స్థానాలలో బ్యాక్ స్టెప్ వేసింది. రెండు రాష్ట్రాలలో కొంత ఉపశమనం కలిగినా అక్కడా లోకల్ పార్టీల పట్టు బలంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో అనూహ్యంగా ఇండియా కూటమి పుంజుకుంది. పైగా, శివసేనకు చెందిన ఉద్దవ్ వర్గం తమదే అసలైన శివసేన అని నిరూపించుకుంది. ఇక, ఉత్తరాది రాష్ట్రాలలో రైతు ఉద్యమాలు బీజేపీ నడ్డి విరిచినట్లు కనిపిస్తోందని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్లో బీజేపీ గ్రాఫ్ తగ్గడానికి రైతుల వ్యతిరేకతే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు, నితీష్ కుమార్ కీలకం కాబోతున్నారు.
యూపీలో వీచిన ఎదురుగాలి
దేశ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్ ఫలితాలు బీజేపీని తీవ్ర నైరాశ్యంలో నింపాయి. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్పై బీజేపీ చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ, అక్కడ సగానికి సగం సీట్లు తగ్గిపోయాయి. బీజేపీ ప్రముఖులకు సైతం ఓటమి తప్పలేదు. మొత్తం 80 స్థానాలలో 42కి పైగా స్థానాల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. 2019లో యూపీలో బీజేపీ మొత్తం 62 సీట్లను గెలుచుకోగా, 2014తో పోలిస్తే 9 సీట్లు తగ్గాయి. ఎగ్జిట్ పోల్స్ ఈ సారి ఏకంగా 70 కన్నా ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు. కానీ, ఆ లెక్కలు తారుమారయ్యాయి. ఆ రాష్ట్రంలో అధికారం పోగొట్టుకునే దిశగా బీజేపీ కొనసాగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్య రామమందిర నిర్మాణాన్ని చేసి దానినే ఓట్లు రాల్చే మంత్రంగా చెప్పుకున్న బీజేపీకి యూపీ ఓటర్లు గట్టిగానే జవాబు చెప్పారు. ఎందుకంటే ఒకొనొక దశలో కొన్ని రౌండ్లలో సాక్షాత్తూ మోదీయే వారణాసిలో వెనుకంజలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఎంతలా పెరిగిందో.
దీదీ దెబ్బ.. పుంజుకున్న హస్తం
పశ్చిమ బెంగాల్లో మరోసారి మమతా బెనర్జీ మాయాజాలం ఫలించింది. 29 స్థానాల్లో విజయం సాధించింది టీఎంసీ. బీజేపీ 12కు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 2 సీట్లను 18కి పెంచుకుంది. కానీ, ఈసారి 12తో సరిపెట్టుకుంది. మణిపూర్లో రెండు లోక్ సభ స్థానాలలో ఒకదాంట్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. ఓవరాల్గా కాంగ్రెస్ కూటమి బాగానే పుంజుకుంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 99 సీట్లను గెలుచుకుంది. రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ దేశవ్యాప్త ప్రచారం పార్టీకి బాగా కలిసివచ్చింది. గతంలో పోలిస్తే మైనారిటీ ఓట్లను తమవైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ నేతలు సక్సెసయ్యారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న ప్రచారం బాగా కలిసి వచ్చింది. దేశవ్యాప్తంగా ముస్లిం ఓట్లను రాబట్టుకోవడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఏది ఏమైనా బీజేపీ దూకుడుకు ఈసారి కాంగ్రెస్ బ్రేకులు వేసింది. 40 సీట్లు కంటే ఎక్కువ రావని మోదీ అండ్ కో కాంగ్రెస్ను ఓ ఆట ఆడేసుకున్నారు. మరి ఇప్పుడేమంటారు. మితిమీరిన అత్యుత్సాహం ప్రదర్శించిన బీజేపీకి ఈ ఎన్నికలు భారీ గుణపాఠం అంటూ హస్తం వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.