Kavitha Politics: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో జాగృతి తరపున అభ్యర్థి?
కవిత కీలక స్ట్రాటజీ !
బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చీల్చేందుకు ప్లాన్!
ముఖ్యనేతలతో అంతర్గతంగా సమీక్ష
తొలిసారి జాగృతి పేరుతో పోటీకి సన్నద్ధం
జాగృతి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్పై సర్వే?
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి నిలుస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అందుకు జాగృతి ముఖ్యనేతలు, బీసీ సంఘాల నేతలతో కవిత అంతర్గతంగా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అందులో ఎక్కువశాతం మంది అభ్యర్థిని బరిలో నిలపాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కవిత జాగృతి (Kavitha Politics) తరుపున అభ్యర్థిని బరిలో నిలిపితే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంటుందని, ఆ పార్టీపై తీవ్ర ప్రభావం పడి నష్టం జరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తన బలాన్ని పరీక్షించుకోవాలని ఆమె ఆలోచిస్తున్నారని, అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె పోటీ చేస్తే బీఆర్ఎస్కు నష్టం చేస్తుందని, కవితకు దక్కే ప్రతి ఓటు బీఆర్ఎస్ ఓటే అని, తద్వారా పార్టీ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు మదనపడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కవిత సస్పెన్షన్ అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నట్టు కనిపిస్తోంది.
కేసీఆర్ కుటుంబ సభ్యురాలిగా, పార్టీలో కీలక నేతగా ఉన్న కవిత పార్టీ నుంచి బయటకు వెళ్లడం రాజకీయాలను ప్రభావితం చేస్తుందని ఇటీవల ఓటా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బతుకమ్మ వంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన కవిత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్కు నష్టం చేకూర్చేఅవకాశం లేకపోలేదు. ఆమెపై మహిళల్లో సానుభూతి కూడా ఉంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి పార్టీ, లేదా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కొత్త రాజకీయ శక్తిని తెరపైకి తీసుకురావాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని యోచిస్తున్నట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఒక వేళ ఆమె పోటీ చేయకపోయినా తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థిని బరిలో నిలపాలని ఆమె యోచిస్తున్నట్టు సమాచారం.
Read Also- Rain Alert: వర్షాలపై అలర్ట్.. హెల్ప్లైన్ నంబర్ విడుదల చేసిన హైదరాబాద్ కలెక్టరేట్
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన కవిత.. తానేంటో నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్తో విభేధించిన అనంతరం రాజకీయంగా తన ప్రభావం చూపించకుండా సైలెంట్గా ఉంటే.. అది తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుందని జాగృతి సీనియర్ నేతలు కవితకు సూచించినట్టు సమాచారం. లేదంటే, కాళేశ్వరం అవినీతి మరకల నుంచి కేసీఆర్ను తప్పించేందుకు కవిత డ్రామాలు ఆడుతున్నారనే ప్రచారం ప్రజల్లో మరింత బలపడుతుందని చెప్పడంతో ఆమె జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై గురిపెట్టినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాగృతి బృందాలు క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో బీఆర్ఎస్ కలవరపాటుకు గురైనట్టు సమాచారం. ఇప్పటికే ఉన్న సమస్యలు చాలక కవిత కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారని ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన రహమత్నగర్ డివిజన్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ముఖ్య నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో సెటిలర్ల ప్రభావం అధికంగా ఉన్నా కూడా.. కవిత బీఆర్ఎస్కు నష్టం చేస్తారని, జాగృతి నేతలు సంప్రదాయ తెలంగాణ మహిళా ఓటర్లను పెద్దఎత్తున ఆకర్షించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.
Read Also- only murders in the building season 5: కితకితలు పెట్టిస్తున్న థ్రల్లర్ సిరీస్.. ఎక్కడంటే?
పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలు, కేసీఆర్ కుటుంబ సమస్యలు, స్థానిక నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం వంటి కారణాలతో బీఆర్ఎస్ సతమతమవుతోంది. మరోవైపు మాగంటి సునీత, మాగంటి వజ్రనాథ్ వర్గాల మధ్య ఉన్నవిభేదాలు, అటు ఉపఎన్నిక టికెట్ ఆశించి భంగపడిన మరోనేత వర్గం పార్టీ అధినాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అనుకూలంగా లేని పరిస్థితులకు తోడు తాజాగా బీఆర్ఎస్ను కల్వకుంట్ల కవిత టెన్షన్ పెడుతున్నది. ఈపరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలా ముందుకు పోతుంది?, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్గా మారింది.