Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను, హెల్ప్ డెస్క్ ను గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం కాల్ సెంటర్ ఫోన్ నెం. 1800 599 5991 ను ఆవిష్కరించారు.
‘సమస్య ఉంటే కాల్ చేయండి’
ప్రారంభోత్సవ అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చునన్నారు. లబ్ధిదారుల ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు ఆధారంగా వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
Also Read: Asia Cup 2025: భారత్ – పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ పిటిషన్.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
‘పరిష్కరించి తెలియజేస్తాం’
నిర్ణీత గడువులోగా బిల్లులు జమ కాకపోవడం, ఎక్కడైనా ఎవరైనా సిబ్బంది ఫోటోలను అప్ లోడ్ చేయడంలో ఆలస్యం చేయడం, ఇతర సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై ప్రజలు నేరుగా కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లి చర్యలు తీసుకుని లబ్ధిదారులకు కూడా ఆ వివరాలను తెలియచేస్తారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు పొంగులేటి అన్నారు.
Also Read: CM Revanth Reddy: గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాల్లోనే కొత్త రైల్వే లైన్లు.. సీఎం రేవంత్ వెల్లడి
అవినీతికి ఆస్కారం లేకుండా..
ఇందిరమ్మ యాప్ ద్వారా మంచి ఫలితాలు సాధించామని, కృత్రిమ మేధ ( ఎఐ) ను కూడా విరివిగా వాడుతున్నామని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువ అవుతున్నామని పేర్కొన్నారు. అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం 5 లక్షల రూపాయల సబ్సిడీతో పేదలకు ఇండ్ల నిర్మాణానికి సహాయం అందిస్తోందని అన్నారు. అనంతరం కాల్ సెంటర్ ద్వారా లబ్దిదారులు అడిగిన పలు సందేహాలను మంత్రి స్వయంగా నివృత్తి చేశారు.