Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత కేసీఆర్ తనయురాలు కవిత జాగృతిపై తన ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో శనివారం జాగృతిలో భారీగా చేరికలు జరిగాయి. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కవిత వారికి కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. 2001 నుంచి కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ గోపు సదానందం, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, అరె కటిక సంఘం సురేందర్ తమ అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని గుర్తించే తాము జాగృతిలో చేరుతున్నామని వారు ప్రకటించారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని వారు పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషపన్లపై సమాలోచనలు
మరోవైపు రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పలువురు బీసీ సంఘాల నాయకులతో కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. శనివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో వివిధ బీసీ సంఘాల నాయకులతో ఆమె సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయకుండానే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉందని.. అదే జరిగితే ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
‘హామీ ఇచ్చి మాట తప్పారు’
తెలంగాణ జాగృతి, బీసీ సమాజం ఒత్తిడికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్ లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లులు పాస్ చేసిందని కవిత అన్నారు. అయితే వాటికి రాష్ట్రపతి ఆమోదం కోసం చిన్న ప్రయత్నం కూడా చేయలేదన్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. కేంద్రం వద్ద బిల్లులు పెండింగ్ లో ఉండగానే రాష్ట్ర కేబినెట్ రిజర్వేషన్ల పెంపునకు చట్ట సవరణ చేస్తున్నట్టుగా ప్రకటించి ఆ ప్రతిపాదనలు గవర్నర్ కు పంపిందన్నారు. అటు కేంద్రం, ఇటు గవర్నర్ ను కలిసి రిజర్వేషన్లు సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కనీస ప్రయత్నాలు చేయలేదన్నారు.
Also Read: Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్
‘త్వరలో కార్యాచరణ ప్రకటిస్తా’
రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను, కేంద్రం, కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ తొక్కిపెట్టినా న్యాయపోరాటం చేసి ఒత్తిడి తెచ్చే ప్రయత్నమేది కాంగ్రెస్ చేయలేదని కవిత అన్నారు. బీసీలను మభ్యపెట్టేందుకు ఇటీవల అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి చట్ట సవరణ పేరుతో మళ్లీ మోసపూరిత రాజకీయాలకు ప్రభుత్వం తెరతీసిందన్నారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ నాయకులు, వివిధ కులాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.