BRS Candidate Win In Mahabubnagar Local Body MLC By Election: మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి ఊహించని షాక్ ఇచ్చారు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందారు. నవీన్ కుమార్కు 763, జీవన్ రెడ్డికి 652 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు పడింది. మొత్తం 1,437 ఓట్లు పోల్ కాగా అందులో 27 ఓట్లు చెల్లనవిగా అధికారులు గుర్తించారు.
దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలారు. అటు, కౌంటింగ్ జరుగుతుండగానే కాంగ్రెస్ అభ్యర్థి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.ఇక ఎలక్షన్కి ముందు ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు క్యాంపు రాజకీయాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులు ముట్ట చెప్పారని ప్రచారం జరిగింది. డబ్బు, అధికార ప్రభావం వల్ల ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని అన్ని పార్టీల నాయకులు ఊహించారు.
Also Read: అవినీతి అంతం, రేవంత్ పంతం
కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవహరించి అభ్యర్థి గెలుపులో ప్రధాన భూమికను పోషించారు. బీఆర్ఎస్ అభ్యర్థి 111 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎమ్మెల్సీ గెలుపుపై అధికారికంగా ప్రకటన వెలువడవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఎదురు దెబ్బ పాలమూరు నుండి ఆరంభం కావడం విశేషం.