Telugu Directors: ఒకప్పుడు ఏ సినిమా తీసినా హిట్ అయ్యేది. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. ఎంత బడ్జెట్ పెట్టినా ప్రయోజనం ఉండటం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకుల అభిరుచులు చాలా వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోల హవా, భారీ బడ్జెట్, గ్లామర్తోనే సినిమాలు బాక్సాఫీస్ వద్ద జెండా ఎగరేసేవి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ , కంటెంట్కు ప్రాధాన్యత ఇస్తున్న ప్రేక్షకులు, స్టార్ హీరోల సినిమాలైనా కథ బలంగా లేకపోతే నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు.
కొత్త ఆలోచనలు, వైవిధ్యమైన కథాంశాలు, భావోద్వేగాలతో కూడిన చిత్రాలకు మాత్రం ఆడియెన్స్ హృదయపూర్వకంగా ఆదరిస్తున్నారు. ఈ మార్పుకు తాజా ఉదాహరణ ఇటీవల రిలీజ్ అయినా యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. ఈ సినిమా తన ప్రత్యేకమైన కథనం, సాంకేతిక నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే కలెక్షన్లు సాధించి విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల రుచుల్లో వచ్చిన మార్పును స్పష్టంగా చాటింది. అయితే, ఈ విజయాల నడుమ ఒక చిన్న మూవీ మాత్రం ఆడియెన్స్ ఆదరణ పొందడంలో వెనుకబడింది.
శుక్రవారం ఆగస్టు 29, 2025 న రిలీజ్ అయిన త్రిబాణధారి బార్బరిక్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం, సత్యరాజ్, వశిష్ట ఎన్. సింహా వంటి నటులతో, దర్శకుడు మోహన్ శ్రీవత్స రూపొందించిన ఈ సినిమా, విమర్శకుల నుండి మంచి రివ్యూలు అందుకుంది. సినిమా కథ, సత్యరాజ్ నటన, స్క్రీన్ప్లే, సాంకేతిక అంశాలను విమర్శకులు ప్రశంసించారు. సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్యామ్ ఖాతు (సత్యరాజ్) తన మనవరాలు నిధి అదృశ్యమైన కేసును కేంద్రంగా చేసుకుని, సామాజిక సందేశంతో కూడిన ఈ కథాంశం ఆకట్టుకుంటుందని రివ్యూలు చెబుతున్నాయి. అయినప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.