CM Revanth Reddy: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలుగు వారందరూ ఒక తాటిపైకి వచ్చి తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని నిర్ణయించినట్లు చెప్పారు. నీలం సంజీవరెడ్డి , వివిగిరి, పీవీ నరసింహరావు, జైపాల్ రెడ్డి ,వెంకయ్య నాయుడు, ఎన్టీ రామారావు వంటి తెలుగు నేతలు గతంలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ రోజుల్లో తెలుగు నాయకులు జాతీయ రాజకీయాల్లో అంత కీలకంగా లేరని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమి ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గౌరవించి ఎన్నికల బరిలోకి దిగారని సీఎం అన్నారు.
‘తెలుగువారి గౌరవం పెరిగేలా’
ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో సుదర్శన్ రెడ్డి దిగడం వల్ల ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని ఎన్డీఎ కూటమి, రాజ్యాంగాన్ని కాపాడాలని , రిజర్వేషన్లను కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఇండియా కూటమి ఎన్నికల్లో దిగాయి. ఉప రాష్ట్రపతి రాజీనామా చేయడం ఆశ్చర్యకరం. ఆయన రాజీనామాను దేశ ప్రజలు గమనిస్తున్నారు. తెలుగు వ్యక్తికి జాతీయ స్థాయిలో అవకాశం వచ్చింది. తెలుగు వారి గౌరవం పెరిగేలా అందరూ ఒక తాటిపైకి వచ్చి సుదర్శన్ రెడ్డి కి అండగా నిలబడాలి’ అని సీఎం అన్నారు.
చంద్రబాబు, పవన్, జగన్ గురించి..
ఉపరాష్ట్ర పదవి ఎన్నికలో తెలుగు వ్యక్తికి మద్దతుగా నిలవాలని ఏపీ ప్రభుత్వాన్ని సైతం సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ , చంద్రశేఖర్ రావు, ఓవైసీతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు, 18 మంది రాజ్యసభ సభ్యులకు నా విజ్ఞప్తి. మీ ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలని వ్యక్తిగతంగా నా విన్నపం. జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండో స్థానంలో ఉన్నప్పుడు తెలుగువారు కూడా ఆ స్థాయిలో ఉండాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిస్తే తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుంది’ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Also Read: Crows: కాకితో జాగ్రత్త.. పగబట్టిందో మీ పని ఔట్.. దాని జీవితాంతం మీరే శత్రువు!
‘అంతం చేస్తానంటే కుదరదు’
18 ఏళ్ల కు ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచన ఒక వైపు.. ఓట్ చోర్ ఆలోచనతో మరో పార్టీ ఇంకో వైపు దేశంలో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘పెద్దల సభ రాజ్యసభ చైర్మన్ సీటులో గౌరవమైన వ్యక్తులు,అంబేద్కర్ విధానాలపైన సంపూర్ణ విశ్వాసం ఉన్నవారు కూర్చుంటే పూర్తి న్యాయం జరుగుతుంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సుదీర్ష అనుభవం ఉంది. ఆయన వివిధ హోదాల్లో రాజ్యంగ స్పూర్తితో పనిచేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. రాజ్యాంగాన్ని రక్షించే పార్టీలో ఆయన మొదటి సభ్యత్వం తీసుకున్నారు.. రాజ్యాంగాన్ని రక్షించడమే ఆయన పార్టీ. ఎజెండా, జెండా లేకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అంతా మద్దతు ఇవ్వాలి. రాజ్యాంగాన్ని రక్షిస్తే దేశాన్ని రక్షించినట్లే.. లేకుంటే దేశానికి నష్టం జరుగుతుంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ని ఒక జాతీయ నాయకుడు నక్సలైట్ అని అంటున్నారు. నక్సలిజం ఒక విధానం మాత్రమే. నక్సలిజం ఫిలాసఫీ నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. మనకు నచ్చని ఫిలాసఫీ తో వాదించి గెలవాలి. కాని అంతం చేస్తానంటే కుదరదు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.