Loss to Panchayat Raj: కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 1291 ప్రాంతాల్లో రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.22.71 కోట్లు, శాశ్వత మరమ్మతుల కోసం రూ.352కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం మొత్తం రూ.374.71 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. 22 గ్రామాలకు రాకపోకలు దెబ్బతినగా, వాటిలో 14 గ్రామాలకు తాత్కాలికంగా రహదారులను పునరుద్ధరించారు. మిగిలిన గ్రామాలకు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
అధిక వర్షాల నేపథ్యంలో ప్రజలకు వేగవంతమైన సాయం అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. హైదరాబాద్ లోని ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్) కార్యాలయంలో ప్రత్యేకంగా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. రహదారి సమస్యలు, ఇంజినీరింగ్ సమస్యలు తలెత్తినా, రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కూలినా, గండ్లు పడినా సమావేశం తెలియజేయవచ్చు. 040-3517 4352 నెంబర్ కు సమాచారం అందిస్తే తక్షణం చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్
భారీ వర్షాలతో పంచాయతీరాజ్ శాఖ రోడ్లు దెబ్బతిన్న నేపథ్యంలో మంత్రి సీతక్క శుక్రవారం ఈఎన్సీ అశోక్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దెబ్బతిన్న రహదారుల వివరాలపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్న గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. వర్షాలకు తడిచి కూలే ప్రమాదం ఉన్న పంచాయతీరాజ్ భవనాలను తక్షణం ఖాళీ చేయించాలని, పంచాయతీరాజ్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు వేగంగా చేపట్టాలని స్పష్టం చేశారు.