Allu Kanakaratnamma: కీ.శే అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ తల్లి, చిరంజీవి అత్తగారైన కనకరత్నమ్మ (94) (Allu Kanakaratnamma) అంత్యక్రియలు ముగిశాయి. అల్లు, మెగా కుటుంబాల అశ్రు నయనాల మధ్య ఆమె అంతిమ యాత్ర సాగింది. తన తల్లికి కుమారుడైన అల్లు అరవింద్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కోకాపేట్ అల్లు వ్యవసాయ క్షేత్రంలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిపారు.
పాడె మోసిన మనవళ్లు
కనకరత్నమ్మ అంతిమ యాత్రలో.. అల్లుడు చిరంజీవి (Chiranjeevi)తో పాటు మనవళ్లు అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan), ముని మనవడు అల్లు అయాన్ (Allu Ayaan) కూడా పాడె మోశారు. ఈ అంతిమ యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు అల్లు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కనకరత్నమ్మ మృతితో.. వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అర్ధరాత్రి మృతి
అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నమ్మ 94 సంవత్సరాల వయసులో వృధ్ధాప్యకారణాలతో శుక్రవారం అర్ధరాత్రి 1.45 నిమిషాలకు కన్నుమూసినట్లుగా అల్లు ఫ్యామిలీ ప్రకటించింది. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే చిరంజీవి.. అల్లు అరవింద్ ఇంటికి చేరుకోగా, ఆ తర్వాత బన్నీ ముంబై నుంచి, రామ్ చరణ్ మైసూర్ నుంచి హైదరాబాద్ చేరుకుని కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు.
Also Read- Sugali Preethi Case: పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్!
ఎంతో బాధాకరం
‘‘మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః’’ అని చిరంజీవి నివాళులు అర్పించారు.
ఎంతో ఆప్యాయత చూపేవారు
‘‘దివంగత అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖ గారిని తీర్చిదిద్దారు. శ్రీమతి కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అల్లు అరవింద్ గారికి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
గొడవలేం లేవ్..
కొన్నాళ్లుగా మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నట్లుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్కు అసలు పడటం లేదనేలా వార్తలు ప్రచారమయ్యాయి. కానీ, వారిద్దరూ దగ్గరుండి అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిపి.. మేమంతా కలిసే ఉన్నామని నిరూపించారు. వారిద్దరిని అలా చూసిన ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ.. కష్టం వస్తే ఒకరికి ఒకరు ఎలా నిలబడాలో వారిద్దరినీ చూసి నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు