Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా చేర్చే కొత్త ప్రయోగం మొదలైంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ టీమ్ ‘అగ్ని పరీక్ష’ అనే సరికొత్త పోటీని మన ముందుకు తీసుకొచ్చింది. దాదాపు 30 నుంచి 40 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 45 మందిని ఎంపిక చేశారు. వీరి ప్రవర్తన, ఆటతీరును బట్టి ఐదుగురిని సీజన్ 9 కంటెస్టెంట్లుగా ఎంచుకోనున్నారు. ఈ ఎంపిక బాధ్యతను మాజీ విజేతలు అభిజిత్, బిందు మాధవి, మాజీ కంటెస్టెంట్ నవదీప్లకు అప్పగించారు. ప్రస్తుతం ఈ అగ్ని పరీక్ష హోరాహోరీగా సాగుతోంది.
అయితే, ఈ ప్రక్రియపై సీజన్ 2 విజేత కౌశల్ ఓ సంచలన వీడియోను విడుదల చేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. “సామాన్యులను హౌస్లోకి తీసుకోవడం అద్భుతమైన ఆలోచన. కానీ జడ్జిల ఎంపిక విషయంలో నాకు తీవ్ర అభ్యంతరం ఉంది. అభిజిత్ సీజన్ 4 విజేత, బిందు మాధవి ఓటీటీ విజేత కాబట్టి వారు జడ్జిలుగా సరిపోతారు. కానీ నవదీప్ను ఎందుకు ఎంచుకున్నారు? అతను సీజన్ 1లో కేవలం మూడో స్థానంలో నిలిచాడు. అతని స్థానంలో సీజన్ 1 విజేత శివబాలాజీని జడ్జిగా తీసుకుంటే, విజేతలకు గౌరవం దక్కి ఉండేది,” అని కౌశల్ విమర్శించాడు.సీజన్ 2లో గెలిచిన తర్వాత కౌశల్ మళ్లీ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టలేదు. ఇతర మాజీ కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా లేదా గెస్ట్లుగా స్టేజ్పై కనిపించినా, కౌశల్ మాత్రం దూరంగానే ఉన్నాడు. ఈ విషయంపై అతను స్పందిస్తూ, “నా విజయం బిగ్ బాస్ టీమ్కు ఏమాత్రం ఇష్టం లేదు. ప్రేక్షకుల ప్రేమ, ఓట్ల వల్లే నేను గెలిచాను. అందుకే నన్ను ఎప్పుడూ హౌస్లోకి ఆహ్వానించలేదు. సాధారణంగా విజేతను స్టేజ్పై గ్రాండ్గా ప్రకటిస్తారు, కానీ నా విషయంలో స్క్రీన్పై చూపించారు. ఇది బిగ్ బాస్ టీమ్కు నా గెలుపు నచ్చలేదని స్పష్టంగా తెలియజేస్తుంది,” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి, తీవ్ర చర్చనీయాంశంగా నిలిచాయి.