Rajiv Yuva Vikasam: స్థానిక సంస్థల ఎన్నిక తర్వాతే యువ వికాసం..!
దరఖాస్తుల పరిశీలన, విచారణ పూర్తి
జూన్ 2న మంజూరు పత్రాలు నిలిపివేత
లబ్ధిదారుల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ
రాజీవ్ యువవికాసం పథకం అమలులో జాప్యం
రంగారెడ్డిలో 78,789… వికారాబాద్లో 57,844 దరఖాస్తులు
స్వేచ్ఛ, రంగారెడ్డి బ్యూరో: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో దరఖాస్తులు కూడా స్వీకరించింది. దరఖాస్తులను ఒక్కొక్కటిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, లబ్ధిదారుల ఎంపిక చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగానే జిల్లాలోనే అధికారులు దరఖాస్తులు పరిశీలించి అర్హుల జాబితాను రూపొందించింది. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్దతుల్లో అధికారులు వివరాలు పరిశీలించారు. అయితే, జూన్ 2న లబ్ధిదారులకు మొదటి విడతలో భాగంగా యువ వికాసం మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని భావించి సిద్దమైంది. కానీ, దరఖాస్తులు అధికంగా రావడంతో మరోసారి పున:పరిశీలించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించడంతో మంజూరు పత్రాల పంపిణీ నిలిచిపోయింది. తిరిగి ఈ ప్రక్రియ ఇప్పట్లో ఉండకపోవచ్చని, స్ధానిక సంస్థల ఎన్నికల తర్వాతే పథకం అమలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also- Teenmaar Mallanna: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా దరఖాస్తులు…
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు స్వయం ఉపాథి కల్పించాలనే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. అయితే, విడతల వారీగా రుణాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మొదటి విడతలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యానికి, వచ్చిన దరఖాస్తులకు పొంతన లేకుండా పోయింది. అంతేకాదు, రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులను క్షేత్రస్ధాయిలో పరిశీలన చేస్తే అర్హుల జాబితా, నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని మించిపోయినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 78,789 దరఖాస్తులు, వికారాబాద్ జిల్లాలో 57,844 దరఖాస్తులు వచ్చాయి. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఇచ్చే రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే, అత్యధికంగా రూ.4 లక్షల రుణాల కోసమే దరఖాస్తు వచ్చాయని, రూ.50 వేలు, రూ.లక్ష రుణాల దరఖాస్తుదారులు అతి తక్కువగా వచ్చాయని చెప్పారు. దీంతో, పథకం అమలు విషయంలో జాప్యం చేయాల్సి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మొదటగా రూ.50 వేలు, రూ.1 లక్ష రుణాలను టార్గెట్గా చేసుకొని పంపిణీ చేయాలని భావించింది. కానీ, ఈ రుణాలకు దరఖాస్తుదారులు మక్కువ చూపకపోవడంతో ప్రభుత్వం డైలమాలో పడినట్టు అయింది. రంగారెడ్డి జిల్లాలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రూ.50 వేల రుణ యూనిట్లకు 1,147 మంది, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు 1,360 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం రూ.50 వేల యూనిట్లు 1,486 మందికి, లక్ష వరకు యూనిట్లకు 2చ472 మంది వరకు ఇవ్వాలంటూ జిల్లా అధికారులను నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదే తరహాలో వికారాబాద్ జిల్లాలో రూ.50 వేల యూనిట్లు 4,704 కేటాయించగా 790, రూ. లక్ష యూనిట్లు 3,719 కేటాయించగా 2,485 దరఖాస్తులు వచ్చాయి. ఈవిధంగా జిల్లాలో పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
Read Also- Election Commission: రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ’ ఆరోపణలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కీలక ప్రెస్మీట్
అత్యధికంగా రూ.4లక్షల రుణాలకే…
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, ఓబీసీ వర్గాల ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో అత్యధిక సంఖ్యలో బీసీ లే రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికి అన్ని వర్గాల ప్రజలు రూ.4లక్షల రుణాల కోసమే అత్యధికంగా దరఖాస్తులు చేసుకున్నట్లు జిల్లా అధికారులు వివరించారు. అయితే రూ.2 లక్షలపైబడి చేసుకున్న యూనిట్లకు అర్హత లేకపోతే రూ.50, రూ.లక్ష రుణాలు దక్కే అవకాశం ఉంటుంది. దరఖాస్తుదారులు చేసుకున్న యూనిట్ల స్ధాయిలో ఏ స్థాయికి అర్హుడనే విషయాన్ని అధికారులు క్షేత్రస్ధాయి ఆధారంగా నిర్ధిశించనున్నట్లు తెలిపారు. త్వరలోనే లబ్ధిదారులు జాబితాను ఎంపిక చేసి రుణాలు ఇచ్చేందుకు కసరత్తు చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
రాజీవ్ యువ వికాసానికి వచ్చిన దరఖాస్తులు
కార్పొరేషన్ రంగారెడ్డి వికారాబాద్
ఎస్సీ 18,552 12,764
ఎస్టీ 6,913 6,616
బీసీ 36,607 23,180
మైనారిటీ 13,670 14,152
క్రిస్టియన్ 387 53
ఈబీసీ 2,660 –
మొత్తం 78,789 57,844