Khammam Police Station: మద్యం మత్తులో ఇరువర్గాలు రెచ్చిపోయి పరస్పర దాడులకు తెగబడిన ఘటనలో 11 మందిపై కేసు నమోదు చేసి.. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఈ మధ్యకాలంలో రెండు వర్గాలు పోట్లాడుకునే కేసులు ఎక్కువవుతోన్న విషయం తెలిసిందే. చిన్న విషయంతో గొడవ పెట్టుకోవడం, దానిని పెద్దది చేసుకుని, పాత కక్షలతో కొట్టుకునే వరకు వెళ్లడం వంటివి తరుచూ జరుగుతున్నవే. ఇప్పుడిలాంటి ఘటనే బుధవారం రాత్రి ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ (Khammam Police Station) పరిధిలోని గోపాలపురంలో జరిగింది. గోపాలపురంలోని రాకేష్ (Rakesh) అనే వ్యక్తి.. మద్యం తాగిన మత్తులో రోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. సమీపంలో దుకాణం నడుపుతున్న కవిత (Kavitha), వేణుగోపాల్ (Venu Gopal) ఈ విషయాన్ని రాకేష్ భార్య దుర్గ భవానికి చెప్పడంతో గొడవ మొదలైంది. దీనికి పాత కక్షలు కూడా తోడు కావడం పాటు, కొంతమంది ఆకతాయిలు జత కావడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆకతాయిల బ్యాచ్ పెట్రోల్ తెచ్చి షాపు ఎదుట వున్న వస్తువులపై పెట్రోల్ పోసి నిప్పు అంటించగా.. పక్కన పార్క్ చేసిన స్కూటీ పాక్షికంగా తగలబడిందని తెలిపారు. దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఇరువర్గాలు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం విచారణ జరిపి, ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామని టౌన్ ఏసీపీ రమణమూర్తి అన్నారు. మొత్తం 11 మందిపై కేసు నమోదవగా.. మరో ఇద్దరు హాస్పటల్లో చికిత్స పొందుతున్నారని, ఇద్దరు పరారీలో వున్నారని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాలు స్వీకరించారా..? అనే కోణంలో..
విచక్షణా రహితంగా నడిరోడ్డుపై దాడులకు పాల్పడిన వారు మాదక ద్రవ్యాలు ఏమైనా స్వీకరించరా? అనేది తెలుసుకునేందుకు గంజాయి కిట్ ద్వారా అందరికీ మూత్ర పరీక్షలు నిర్వహించారు. అనంతరం గంజాయి, మాదక ద్రవ్యాలు తీసుకోలేదని నిర్ధారించారు. గంజాయి తీసుకునే వ్యక్తులకు 15 రోజుల వరకు మూత్ర పరీక్షలలో తెలుసుకునే అవకాశం వుంటుందని ఈ సందర్బంగా తెలిపారు. రుదావత్ దుర్గా భవానీ ఫిర్యాదుతో A1 గోపాల్, A2 వేణు, A3 వినోద్, A4 లక్ష్మి, A5 కవిత.. బానోత్ వేణు ఫిర్యాదుతో A1 రాకేష్, A2 శ్రీనాధ్, A3 మహేష్, A4 ఉమేష్, A5 వరుణ్ తేజ, A6 కార్తీక్లపై కేసులు నమోదు చేశారు.
ముఖ్యంగా ఎలాంటి ఆధారాలు, నిర్ధారణ లేకుండా గంజాయి మత్తులో దాడులు చేశారని, సంబంధిత పోలీస్ అధికారుల వివరణ లేకుండా.. పత్రికల్లో ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని టౌన్ ఏసీపీ రమణమూర్తి సూచించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు