ఇరిగేషన్ శాఖలో ఏసీబీకి పట్టుబడ్డ మరో అవినీతి తిమింగలం
గద్వాల, స్వేచ్ఛ: ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు అనేక చట్టాలు, చర్యలు తీసుకుంటున్నా.. ఆశించిన ఫలితాలు మాత్రం దక్కడం లేదు. క్షేత్ర స్థాయిలో ఇంకా పెద్దగా మార్పు రాలేదనే చెప్పాలి. ప్రభుత్వం తీసుకుంటున్నా అవినీతి నిర్మూలన ఇప్పటికీ పెద్ద సవాలుగానే ఉంది. అవినీతి నిరోధక చట్టాలు, అవినీతి నిరోధానికి నూతన సాంకేతిక పరిష్కారాలు, పారదర్శక విధానాలు తీసుకొస్తున్నప్పటికీ ఏదో ఒక అడ్డదారిలో అక్రమార్కులు అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. దీంతో, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలు నీరుగారుతున్నాయి. తాజాగా మరో అవినీతి అధికారి బాగోతం బయటపడింది.
అలంపూర్ ఆర్డీఎస్లో అవినీతి అధికారి
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఆర్డీఎస్ కార్యాలయంలో రూ.11 వేలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్ శాఖకు చెందిన ఒక అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆర్డీఎస్కు చెందిన మూడు లక్షల రూపాయల విలువైన పనులను కాంట్రాక్టర్ పూర్తి చేయగా, అందుకు సంబంధించిన వివరాలను ఎంబీ బుక్లో నమోదు చేసేందుకు అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ నాయుడు లంచం డిమాండ్ చేశాడు. రూ.12 వేల ఇవ్వాలని కాంట్రాక్టర్ను అడిగాడు. చేపట్టిన పనుల కారణంగా ఇప్పటికే తాను నష్టపోయానని, మానవతా దృక్పథంతో ఎంబీ బుక్ రాయాలంటూ సదరు కాంట్రాక్టర్ వేడుకున్నా ఈడీ శ్రీకాంత్ నాయుడు కనికరించలేదు. ఒక వెయ్యి తగ్గించుకొని రూ.11 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అధికారి తీరుతో తీవ్ర ఆవేదనకు గురైన సదరు కాంట్రాక్టర్… విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
Read Also- Vizag Fishing Harbour: విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఘోర ప్రమాదం
ఏసీబీ అధికారుల సూచనల మేరకు ఆర్డీఎస్ ఇరిగేషన్ కార్యాలయంలో డీఈ శ్రీకాంత్ నాయుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు అందుకుంటుండగా మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో బృందం వల పని పట్టుకున్నారు. ఫెనోఫ్తాలిన్ రసాయనాన్ని పూసిన నోట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు శ్రీకాంత్ నాయుడిని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ సర్వీస్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే వారిపై వచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అవినీతి అధికారుల వివరాలను 1064 అనే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. కాగా, మహబూబ్నగర్లో ఈ బుధవారమే మూడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫయాజ్ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన చోటు చేసుకున్న రెండు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Read Also- Rahul Gandhi: ఓట్ల దోపిడీపై ఆధారాలు ఇవిగో.. డేటా ప్రకటించిన రాహుల్ గాంధీ
కాగా, లంచం కేసుల్లో ఫెనోఫ్తాలిన్ అనే రసాయన ఇండికేటర్ను పూస్తారు. ఏసీబీ, ఇతర అవినీతి నిరోధక సంస్థలు దీన్ని లంచం కేసుల్లో సాక్ష్యాలుగా ఉపయోగిస్తాయి. ఫెనోఫ్తాలిన్ను నీటిలో కరిగించి, దాన్ని నోట్లపై పూస్తారు. సాధారణంగా అయితే ఫెనోఫ్తాలిన్ అనేది ఎలాంటి రంగులేని రసాయనం. దీనిని పూసిన నోట్లను ఎవరైనా చేతితో తాకితే ఆ వ్యక్తి చేతుల చెమటల రసాయనిక చర్య ప్రభావంతో సంబంధిత వ్యక్తి చేతులు గులాబీ లేదా లేత గులాబీ రంగులోకి మారతాయి. ఆ రంగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల లంచం తీసుకున్నట్లుగా అది బలమైన సాక్ష్యంగా పనిచేస్తుంది.