TS Politics:
తలసానికా? పద్మారావుగౌడ్ కా?
హైదరాబాద్లో కుల సమీకరణలను బట్టి పదవి
సబితకు ఏం బాధ్యతలు అప్పగిస్తారు?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బాధ్యతలకు ఎవరికి?
గ్రేటర్లో పట్టునిలుపుకుంటారా?
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ అధ్యక్షుడి పోస్టు ఖాళీగా ఉంది. ఆ బాధ్యతను పార్టీలో ఎవరికి కట్టబెడతారు? కేసీఆర్ మదిలో ఉన్నదెవరు? రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీని గట్టెక్కించే సత్తా ఎవరికి ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్ (TS Politics) అయింది. హైదరాబాద్ అధ్యక్ష పదవిని కులసమీకరణతో ఇస్తారా? లేకుంటే సీనియర్ ప్రాతిపదికన ఇస్తారా? అనేది కూడా పార్టీలో చర్చకు దారితీసింది. గ్రేటర్లో పార్టీకి మంచి పట్టుకుంది. ఆ పట్టునిలుపుకునేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతుందనేది కేడర్లో చర్చనీయాంశంగా మారింది.
గులాబీ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూన్ 8న మృతి చెందారు. ఈయన మృతితో ఇటు పార్టీ పోస్టు, అటు ఎమ్మెల్యే పదవి ఖాళీ అయ్యాయి. అయితే, గ్రేటర్ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. కేడర్తోపాటు నేతలు సైతం చర్చించుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ముగ్గురు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగుళ్ల పద్మారావుగౌడ్, సబితాఇంద్రారెడ్డి సీనియర్లు. వీరికి అన్ని నియోజకవర్గాలపై పట్టుకుంది. కేడర్, నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురు కీలకం కావడంతో బీఆర్ఎస్ అధినేత ఎవరికి గ్రేటర్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారనేది ఉత్కంఠగా మారింది.
Read Also- TS News: ఇలాగైతే.. అక్రమ రవాణా ఆగేదెలా?
మొన్నజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోనే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను ప్రజలు కట్టబెట్టారు. పార్టీకి బలంగా ఉందని దీని ద్వారా స్పష్టమైంది. ఈ తరుణంలో గ్రేటర్ అధ్యక్ష పదవిపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. గ్రేటర్లో యాదవ కమ్యూనిటీ బలంగా ఉంది. అంతేకాకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్కు సైతం ఆదరణ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు గ్రేటర్పై పట్టు ఉంది. తీగుళ్ల పద్మారావుగౌడ్కు సైతం సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. గౌడ్ కమ్యూనిటీ సైతం గ్రేటర్లో బలంగా ఉంది. అంతేగాకుండా అన్ని బీసీలతో పాటు అన్ని వర్గాలతోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. ఇద్దరు బీసీ నేతలే కావడంతో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇప్పుడు గ్రేటర్ అధ్యక్ష పదవీ కాలంగా మారింది. రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించే బాధ్యత ఉంటుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పటికే పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. త్వరలోనే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. అవి కూడా కీలకమేనని పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు పట్టునిలుపుకునే ప్రయత్నాలు చేస్తుంది.
Read Also- Pragya Thakur: మాలేగావ్ పేలుళ్ల కేసుపై ప్రగ్యా థాకూర్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలావుంచితే, సబితా ఇంద్రారెడ్డి సైతం సీనియర్ నేత. రెడ్డి సామాజిక వర్గానికి చెందడం కమ్యూనిటీ బలంగా ఉంది. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాదిరిగా గ్రేటర్కు ఇద్దరు అధ్యక్షులను నియమిస్తే.. సబితా ఇంద్రారెడ్డికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది చర్చనీయాంశమైంది. రెడ్డి సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ వైపునకు తిప్పుకోవాలంటే సబితకు సైతం పార్టీ కీలకమైన పదవి అప్పగించాల్సిన ఆవశ్యకత ఉందనే అభిప్రాయం పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతుంది. ఈ తరుణంలో ముగ్గురు కీలక నేతలు ఉండటంతో వారికి ఎలాంటి బాధ్యతలను పార్టీ అప్పగిస్తుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ఎలా ముందుకు పోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలనేపథ్యంలో పార్టీ అధిష్టానం తలసాని వైపు మొగ్గుచూపుతుందనే ప్రచారం జరుగుతుంది.