Tummala Nageswara Rao: సీడ్ కంపెనీలు చాలావరకు రైతులకు బకాయి పడ్డాయి. రోజుల తరబడి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. జోగులంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను నెలలోగా చెల్లించాలని సీడ్స్ కంపెనీలకు స్పష్టం చేశారు.
సచివాలయంలో సమీక్ష
సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గద్వాల జిల్లా రైతులు సుమారు 50వేల ఎకరాల్లో పత్తి విత్తనాలను సాగు చేశారని అన్నారు. నెలలు గడిచినా ఇప్పటి వరకు వారికి సంబంధిత కంపెనీల నుంచి చెల్లింపులు చేయలేదని స్థానిక ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి ఎలాంటి అసౌకర్యం కలిగినా సహించేది లేదని తుమ్మల స్పష్టం చేశారు.
నెల రోజుల టైమ్
పత్తి విత్తనాల ఉత్పత్తిలో గద్వాల దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు మంత్రి. ఇది దేశానికి తలమానికమని చెప్పారు. విత్తన ఉత్పత్తి చేసి కంపెనీలకు రైతులు అందిస్తే, ఇప్పటి వరకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకపోవడం ఏంటని ప్రశ్నించారు. సదరు కంపెనీలు తక్షణమే స్పందించి నెల రోజుల లోపు బకాయిలను రైతులకు చెల్లించి వారిని ఆదుకోవాలని కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. అన్ని కంపెనీలు కలిపి సుమారు రూ.700 కోట్లు రైతులకు బకాయిలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.
Read Also- Harish Rao: బాధితులకు కోటి రూపాయల పరిహారం అందేనా: హరీష్ రావు
ప్రజా ప్రభుత్వం లక్ష్యం అదే..
రైతులు, వారిపై ఆధారపడిన రైతు కూలీలు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వారికి చెల్లించాలని బకాయిలను వెంటనే చెల్లించాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా లాంటి కార్యక్రమాలతో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచిందని వివరించారు. వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి ఆర్థికంగా అండగా నిలుస్తున్నదని తెలిపారు. రైతులకు లాభం, సౌకర్యం, సంక్షేమం తమ ప్రాధాన్యమని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక, ప్రొబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి, పలు సీడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also- Fitness: అలియా భట్, కత్రినా కైఫ్ అంత ఫిట్ గా ఉండటానికి కారణం అదేనా?