Udaipur Files movie: ఉదయ్పూర్ ఫైల్స్ ఫిల్మ్ రిలీజ్పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ స్టేను సవాల్ చేస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘జీవించే హక్కు మాట్లాడే హక్కు కంటే ముఖ్యమైనది’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చిత్ర విడుదలపై కేంద్రం నిర్ణయాన్ని కోరిన నేపథ్యంలో అప్పటివరకూ దర్శక నిర్మాతలు వేచి ఉండాలని సూచించింది. అనంతరం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
వాదనలు ఇలా..
ఉదయ్పూర్ ఫైల్స్ చిత్రానికి సంబంధించి దాఖలైన పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) , జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి (Justice Joymalya Bagchi)తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల తరపున సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా వాదనలు వినిపించారు. సినిమా విడుదలపై హైకోర్ట్ స్టే విధించడం ద్వారా.. నిర్మాతల వాక్, భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించారని న్యాయమూర్తులకు తెలిపారు. న్యాయవాది వ్యాఖ్యలతో ఏకీభవించని ధర్మాసనం.. ఆర్టికల్ 21 (జీవించే హక్కు), ఆర్టికల్ 19 (వాక్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు) కంటే ముఖ్యమైనదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి ఉండాలని చిత్ర నిర్మాతలను కోరింది.
త్వరగా నిర్ణయం తీసుకోండి
అయితే చిత్ర నిర్మాత, దర్శకుడితో పాటు మృతుడు దివంగత కన్హయ్య లాల్ కుమారుడికి కూడా హత్య బెదిరింపులు వస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ వాదనల్లో నిజం ఉంటే పోలీసులు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. మరోవైపు కేంద్రం ఏర్పాటు చేయబోయే విచారణ కమిటీ.. అన్ని పక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. దీనిపై చిత్ర విడుదలకు సంబంధించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. కాగా కన్హయ్య లాల్ హత్యలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్ జావేద్ (Mohammad Javed) సైతం కమిటీ ఎదుట హాజరై తన అభిప్రాయాలను చెప్పవచ్చని ధర్మసనం స్పష్టం చేసింది.
అల్లర్లు జరుగుతాయని పిటిషన్
‘ఉదయ్పూర్ ఫైల్స్: కన్నయ్య లాల్ టేలర్ మర్డర్’ (Gyanvapi Files: A Tailor’s Murder Story) టైటిల్తో రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెల 11వ తేదీన రిలీజ్ దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఈ సినిమా విడుదలైతే సమాజంలో అల్లర్లు రేకెత్తే అవకాశముందని జామియత్ ఉలామా ఇ హిందూ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాపై బ్యాన్ విధించాలని పట్టుబట్టారు. జూన్ 26న విడుదలై ట్రైలర్ లో అభ్యంతరకర డైలాగ్స్ ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే విధిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ లభించినప్పటికీ.. చిత్రం బ్యాన్ పై పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకోవాలని జులై 10న తీర్పు ఇచ్చింది.
Also Read: Employee Health issues: ఐటీ ఉద్యోగికి కొండంత కష్టం.. తెలిస్తే గుండె తరుక్కుపోవాల్సిందే!
2022లో కన్హయ్య లాల్ హత్య
ఉదయ్ పూర్ కు చెందిన దర్జీ కన్హయ్య లాల్ను జూన్ 2022లో దారుణ హత్యకు గురయ్యారు. మొహమ్మద్ రియాజ్, మొహమ్మద్ గౌస్ ఆ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు చెందిన అంశాన్ని కన్హయ్య లాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో అతడ్ని హతమార్చినట్లు అభియోగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ పరిధిలో ఉంది. జైపూర్ లోని ఎన్ఐఏ కోర్టులో కేసు విచారణ పెండింగ్ లో ఉంది.