POCSO Act: చిన్నారులపట్ల లైంగిక దాడులకు పాల్పడేవారు ఎవరైనా ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోండి ఇటీవల ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పోలీసు అధికారులకు జారీ చేసిన ఆదేశాలివి. అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కూడా. అయితే, ఏయేటికాయేడు చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. యూత్ఫర్యాంటీ కరప్షన్ సంస్థ(Youth for Anti-Corruption Organization) సమాచార హక్కు చట్టం ద్వారా డీజీపీ కార్యాలయం నుంచి సేకరించిన వివరాలు దిగ్ర్భాంతిని కలిగిస్తున్నాయి. 2020–25 మధ్య రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో పోక్సో యాక్ట్(POCSO Act)ప్రకారం 16,994 కేసులు నమోదయ్యాయి. అంటే నెలకు 283 కేసులు రిజిష్టర్ అవుతున్నాయి.
ఆందోళనాకరమైన అంశం ఏమిటంటే ట్రై కమిషనరేట్లలోనే ఎక్కువగా కేసులు నమోదుతుండటం. 2,619 కేసులతో రాచకొండ కమిషనరేట్(Rachakonda Commissionerate) మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాత స్థానంలో 2,293 కేసులతో హైదరాబాద్(Hyderabad) నిలిచింది. 2,026 కేసులతో సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) మూడో స్థానంలో ఉంది. ఇక, గడిచిన అయిదేళ్లలో కేవలం 188 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. ఇక, పోలీసు వర్గాలు చెబుతున్న ప్రకారం 99.2శాతం కేసుల్లో బాధితులకు బాగా తెలిసిన వారే ఈ నేరాలకు పాల్పడుతున్నారు. పోక్సో కేసుల్లో 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు పడుతున్నా పలు ఉదంతాలు దారుణాలకు తెగబడుతున్నారు.
మత్తు, సెల్ ఫోన్లు ప్రధాన కారణాలు
ఏయేటికాయేడు ఈ తరహా నేరాలు పెరిగి పోతుండటానికి మద్యం, గంజాయి మత్తు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దాంతోపాటు అరచేతుల్లోకి వచ్చేసిన మొబైల్ ఫోన్లు కూడా ఈ తరహా దారుణాలు పెరిగి పోతుండటానికి దారి తీస్తోంది. దీనికి నిదర్శనంగా షాద్నగర్ స్టేషన్ పరిధిలో జరిగిన ఉదంతాన్ని పేర్కొనవచ్చు. మద్యానికి అలవాటు పడ్డ ఓ కిరాతకుడు జన్మనిచ్చిన కూతురి పైనే ఆరునెలలపాటు లైంగిక దాడి జరిపాడు. బాలిక ఆరోగ్య పరిస్థితిలో మార్పును గమనించిన స్కూల్టీచర్ల ప్రశ్నించినపుడు బాలిక తండ్రి చేతుల్లో అనుభవిస్తున్న నరకయాతన గురించి చెప్పింది. దాంతో టీచర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపించగా ఆ చిన్నారి గర్భం దాల్చినట్టుగా వెల్లడైంది. వనపర్తిలో ఓ ట్యూషన్టీచర్తన వద్ద చదువుకోవటానికి వచ్చిన 11మంది నాలుగో తరగతి విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడి చివరకు విషయం వెలుగులోకి రావటంతో కటకటాల పాలయ్యాడు.
Also Read: Illegal Constructions: అక్రమ నిర్మాణాలపై అధికారుల అలసత్వం
ఆందోళనాకరమైన అంశం ఏమిటంటే మైనారిటీ తీరని యువకులు కూడా ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం. దీనికి ప్రధాన కారణం ఇంటర్ నెట్అన్నది సుస్పష్టం. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థి వద్ద కూడా మొబైల్ ఫోన్(Mobie Phone) ఉండటం కామన్ అయిపోయింది. తెలిసీ తెలియని వయసులో సెల్ఫోన్లో పోర్న్వీడియోలు(Videos) చూస్తున్న వారిలో కొందరు అలాంటి అనుభవం కోసం దారుణాలకు తెగిస్తున్నారు. హయత్ నగర్స్టేషన్(Hayathnagar) పరిధిలో పదో తరగతి చదువుతున్న నలుగురు ఇలా వీడియోలు చూడటానికి అలవాటుపడి తమ తరగతిలోనే చదువుతున్న మానసిక పరిస్థితి సరిగ్గా లేని బాలికపై అత్యాచారం జరిపారు. విషయం వెలుగులోకి రావటంతో కటకటాల పాలయ్యారు.
అవగాహన కల్పించాలి
తల్లిదండ్రులు ప్రతీ రోజూ కనీసం గంట సమయాన్ని పిల్లలకు కేటాయించి వారికి బ్యాడ్టచ్ గుడ్ టచ్(Bad touch good touch) పై అవగాహన కల్పించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తూ పిల్లలను పెద్దగా పట్టించుకోవటం లేదన్నారు. అలా కాకుండా ఓ గంట సమయం వారికిచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడాలన్నారు. తమకు ఏదైనా సమస్య ఎదురైతే పిల్లలు ధైర్యంగా చెప్పుకునే వెసులుబాటును కల్పించాలన్నారు. పెద్ద స్కూల్లో వేశాం ట్యూషన్పెట్టించాం అంతటితో తమ బాధ్యత తీరిపోయినట్టుగా వ్యవహరించ వద్దని సూచించారు.
స్కూళ్లలో కూడా టీచర్లు పిల్లలకు గుడ్టచ్ బ్యాడ్టచ్పై అవగాహన కల్పించాలన్నారు. ఇక, చాలామంది పదో తరగతి(10nth Class)కి కూడా రాక ముందే పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇస్తున్నారన్నారు. అయితే, పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారన్న దాని గురించి పట్టించుకోవటం లేదన్నారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు బ్రౌజింగ్ హిస్టరీని చెక్ చేయాలన్నారు. పోర్న్ సైట్లను బ్లాక్చెయ్యాలన్నారు. ఇక, పోలీసులు ఇలాంటి కేసుల్లో వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. అప్పుడే కొంతలో కొంతైనా ఈ తరహా దారుణాలు తగ్గుతాయని వ్యాఖ్యానించారు.
Also Read: BCCI – ACC meeting: పాక్కు బీసీసీఐ ఝలక్.. ఏసీసీ సమావేశం బహిష్కరణ.. కారణాలివే!