MLC Kavitha: స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి నాయకులు పోటీ చేయాలని అనుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి విజ్ఞప్తి చేయండి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సూచించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో గురువారం మీడియాతో చిట్ చాట్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 80% స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని వ్యాఖ్యానించారు. జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తున్నారని, తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీనేనని స్పష్టం చేశారు. మీ సమస్యలపై కేటీఆర్కు రాత పూర్వకంగా లేఖ రాయండి అంటూ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశానన్నారు. రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు కోసం ఈ నెల 10న అన్ని పార్టీలకు లేఖ రాస్తానని, బీఆర్ఎస్ పార్టీకి సైతం ఇస్తానని స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ పదేపదే పొడిగింపు సరైంది కాదని, కొత్తవ ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాస్తానని స్పష్టం చేశారు.