KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏమైంది? బాస్ ఎందుకు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు? ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారా? లేకుంటే సాధారణ చెకప్ కోసం వెళ్లారా? అసలేం జరుగుతోంది? అంటూ ఆ పార్టీ శ్రేణులు, వీరాభిమానులు, నేతలు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లిన విషయం మాత్రమే అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో హడావుడి జరుగుతోంది కానీ.. ఎందుకెళ్లారు..? కారణమేంటి? అనే విషయాలు మాత్రం ఎవ్వరూ చెప్పట్లేదు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. కేసీఆర్కు ఏమైంది? అనే దానిపై ‘స్వేచ్ఛ’ ఎక్స్క్లూజివ్గా సమాచారం సేకరించింది. కేసీఆర్ అత్యంత ఆప్తుడు, బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన సమాచారం మేరకు వివరాలు వెల్లడిస్తున్నాం..
Read Also- Vallabhaneni: వైఎస్ జగన్ను కలిసిన వల్లభనేని.. మంత్రి పదవి ఫిక్స్?
ఇదీ అసలు విషయం..
కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది కానీ.. అదంతా అబద్ధమని తేలింది. వాస్తవానికి గులాబీ బాస్ గురువారం రాత్రి యశోద ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కొద్ది రోజులుగా ఆయన సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలిసింది. దీంతో ఒకట్రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పినట్లుగా సమాచారం. ఆయన ఇవాళ ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చిందని తెలుస్తున్నది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. వాస్తవానికి గత నెలలోనే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి మాజీ ముఖ్యమంత్రి వెళ్లారు. అప్పట్నుంచి ఆరోగ్యం సహకరించకపోవడంతో కొద్ది రోజులుగా ఫాంహౌస్కు వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉంటున్నారు. మూడ్రోజుల కిందటే నందినగర్ నివాసంలో కేసీఆర్కు వైద్యులు పలు టెస్టులు చేసినప్పటికీ ఆరోగ్యం సెట్ అవ్వలేదు. దీంతో డాక్టర్ల సలహా మేరకు యశోద ఆస్పత్రిలో గులాబీ బాస్ అడ్మిట్ అయ్యారు. యశోద ఆసుపత్రి యాజమాన్యం త్వరలోనే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక హెల్త్ బులిటెన్ను విడుదల చేసే అవకాశం ఉంది, అప్పుడు మరింత స్పష్టత రానుంది.
ఏమేం పరిక్షలు చేశారు?
గురువారం నాడు కేసీఆర్కు సాధారణ పరీక్షలతో పాటు, రక్త పరీక్షలు, ఇతర అవసరమైన స్కానింగ్లు నిర్వహించారు. సీనియర్ వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఇందులో సాధారణ వైద్య నిపుణులు, పల్మనాలజిస్టులు (ఊపిరితిత్తుల నిపుణులు), గతంలో ఆయనకు చికిత్స అందించిన ఆర్థోపెడిక్ సర్జన్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా, కేసీఆర్ ఇటీవలి కాలంలో తరచుగా ఆరోగ్య సమస్యలతో వార్తల్లో ఉంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 8న ఆయన బాత్రూమ్లో జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. అప్పట్లో ఆయనకు యశోద ఆసుపత్రిలోనే శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత ఆయన కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుని కోలుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత, ఆయన ఫిజియోథెరపీతో కోలుకోవడానికి సమయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ఎక్కువ సమయం వాహనంలో కూర్చొనే ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగలడంతో, కేసీఆర్ కొంతకాలంగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు జ్వరం తీవ్రత అధికంగా ఉండటంతో, దానికి గల కారణాలను తెలుసుకోవడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం సీజనల్ జ్వరమా లేక మరేదైనా అంతర్గత సమస్య ఉందా? అని నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు.. కేసీఆర్ ఆసుపత్రిలో చేరిన వార్త తెలియగానే బీఆర్ఎస్కు చెందిన పలువురు ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయన వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు. కేసీఆర్ త్వరగా త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రార్థిస్తున్నారు.
Read Also- YSRCP: ఎన్నికలైన ఏడాదికి మేల్కొన్న వైసీపీ.. ఇప్పుడెందుకో?