Telangana Government: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పరిపాలనలో మరో మార్పు తీసుకురాబోతున్నది. ఇక నుంచి ‘‘ఈ – ఆఫీస్ తరహాలోనే ఈ – క్యాబినెట్ భేటీలు’’ ( E-Cabinet) నిర్వహించనున్నారు. ఎజెండా, మినిట్స్ అన్నీ డిజిటల్ మోడ్లోనే ఉండనున్నాయి. ఫిజికల్గా ప్రింట్లు, ఎలాంటి నోట్ రిలీజ్లు ఉండవు. (E-Cabinet)క్యాబినెట్లో కూర్చున్న మంత్రుల ముందున్న డెస్క్ టాప్లో ఎజెండా ప్రత్యక్షమవుతుంది. ఆ తర్వాత సీఎం, మంత్రులు మాట్లాడిన అంశాలు కూడా డిజిటల్ విధానంలో రికార్డ్ అవుతాయి. బయటకు లీక్ కాకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకోసం ప్రత్యేక సాప్ట్ వేర్ను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా సమాచారం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒకటి, రెండు రాష్ట్రాల్లో మాత్రమే ఈ – క్యాబినెట్లు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని అమలు తీరును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలించింది. ప్రత్యేకంగా ఉన్నతాధికారులు అక్కడి తీరుపై స్టడీ చేశారు. సాధారణ మీటింగ్లు, ఈ – క్యాబినెట్లకు మధ్య వ్యత్సాసాన్ని గమనించారు. సమయం, పారదర్శకత, నిర్ణయాల్లో ఏ మేరకు స్పీడ్ ఉన్నది, ఎజెండాలో స్పష్టత, అమలులో వేగం వంటి వాటిపై సంపూర్ణంగా అధ్యయనం చేసిన అధికారులు, మన దగ్గర కూడా ఈ తరహాలో అమలు చేయొచ్చని ఓ రిపోర్ట్ కూడా ఇచ్చారు. దీనికి క్యాబినెట్ అంతా ఒకే చెప్పినట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నది.
Also Raad: MHSRB Releases Notifications: స్పీచ్ ఫాథాలజిస్ట్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ!
రాష్ట్రంలో ఫస్ట్ టైమ్ యాక్షన్ రిపోర్ట్ రివ్యూ?
ప్రభుత్వ పరిపాలనను మరింత స్పీడ్గా తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రతి నెలలో రెండు సార్లు క్యాబినెట్ మీటింగ్లు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. అంతేగాక మూడు నెలలకోసారి యాక్షన్ రిపోర్ట్ రివ్యూ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం రివ్యూలు కేవలం కేంద్ర ప్రభుత్వంలో మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అదే విధానాన్ని మొట్ట మొదటిసారిగా అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు దక్కనున్నది. అంతేగాక ప్రతీ 15 రోజులకోసారి రివ్యూలు కూడా ఇతర రాష్ట్రాల్లో జరగడం లేదని, కేవలం మన దగ్గర మాత్రమే నిర్వహించనున్నట్లు సెక్రటేరియట్లోని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. దీని వలన సుపరిపాలనలో సమూలమైన మార్పులు వస్తాయన్నారు.
ఈ కొత్త సంస్కరణలు, నిర్ధిష్టమైన మార్పులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన వివరించారు. ఇక ప్రతి 15 రోజులకోసారి జరిగే క్యాబినెట్ (Cabinet) మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు, పాలసీలు, స్కీమ్స్ ఏ మేరకు అమలవుతున్నాయనేది మానిటరింగ్ చేసేందుకు మూడు నెలలకోసారి జరిగే యాక్షన్ రిపోర్ట్ రివ్యూలో చర్చిస్తారు. ఈ మీటింగ్లో కేవలం మూడు నెలల్లో జరిగిన నిర్ణయాల అమలుపై చర్చిస్తారు. సాధారణంగా క్యాబినెట్లో ఎజెండా, సబ్జెక్ట్ ఆధారంగా మాత్రమే అధికారులు కూర్చుంటారు. కానీ మూడు నెలలకోసారి జరిగే యాక్షన్ ప్లాన్ రిపోర్ట్ రివ్యూలో మాత్రం అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా ఉండాల్సిందే. దీని వలన విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చనే అభిప్రాయంలో సర్కారు ఉన్నది.
షెడ్యూల్ ప్రకారం భేటీలు
ఇక నుంచి క్యాబినెట్ (Cabinet) సమావేశాలు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. తర్వాత ఎప్పుడు ఉంటాయనేది ముందుగానే షెడ్యూల్స్ ఫిక్స్ అవుతాయి. ఇందుకు సంబంధించిన ఎజెండాలు కూడా ప్రిపేర్ అవుతాయి. దీని వలన మంత్రుల షెడ్యూల్స్ కూడా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు సమయం, సందర్భం వెసులుబాటును బట్టి నిర్వహిస్తూ వచ్చారు. దీని వలన కొన్ని సార్లు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇక నుంచి పూర్తి స్థాయిలో ముందస్తు షెడ్యూల్స్ ప్రకారం నిర్వహించబడతాయి. దీని వలన మంత్రుల టూర్లు, ఇతర కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచన.
జూలై 10న క్యాబినెట్
జూలై 10 కేబినెట్ సమావేశం జరగనున్నది. ఇటీవల జరిగిన మీటింగ్లోనే ఈ టైమ్ను ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ప్రధానంగా పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు, ఎన్నికలకు ఎలా వెళ్లాలి, రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు రాజీవ్ యువ వికాసం స్కీమ్, బనకచర్లను అడ్డుకోవడంపై స్టేట్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ స్కూళ్లు పరిస్థితి, అడ్మిషన్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, మెడికల్ కాలేజీలు, డ్రగ్స్ నియంత్రణ, సన్నబియ్యం పంపిణీ తదితర అంశాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉన్నదని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, 15 రోజులకోసారి సమావేశాలు జరగడం వలన ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఉంటుందని అధికారులు కూడ చెబుతున్నారు. గతంలో ఇలాంటి విధానాలు లేకపోవడంతో సమస్యల పరిష్కారానికి నెలల తరబడి నిరీక్షణ ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఉండదని అంటున్నారు.
సీఎం, సీఎస్ మార్క్
ప్రభుత్వ పాలనను మరింత వేగంగా తీసుకువెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావులు తమ మార్క్ను చూపుతున్నారు. ఇటీవల అడ్మినిస్ట్రేషన్ ప్రక్షాళన కోసం భారీగా ఐఏఎస్లను బదిలీలు చేశారు. ఆ తర్వాత క్యాబినెట్ను ప్రతీ 15 రోజులకోసారి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తదనంతరం యాక్షన్ ప్లాన్ రిపోర్ట్ రివ్యూ విధానాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఈ క్యాబినెట్ ఇంప్లిమెంటేషన్కు రెడీ అవుతున్నారు. ప్రజల సమస్యలు, పరిష్కారాలపై స్పష్టమైన అవగాహన కలిగిన వీరిద్దరూ ఇతర దేశాలు, రాష్ట్రాల్లోని బెటర్ విధానాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వాటిలో మెరుగైన ఫాలసీలను మన దగ్గర ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధం అవతున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మంచి రీ ఫామ్స్ తీసుకువస్తుందని ఐఏఎస్ అధికారులు కొందరు వివరిస్తున్నారు.
Also Read: Telangana: మత్తుపై ఉక్కుపాదం.. స్వేచ్ఛ – బిగ్ టీవీ.. మేముసైతం