- పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ ను గట్టెక్కించబోతున్న 6 గ్యారెంటీలు
- ఇప్పటికే అమలైన 5 గ్యారెంటీలు
- ఎన్నికల కోడ్ ప్రభావంతో తాత్కాలికంగా పెండింగ్
- కేవలం నాలుగు నెలల్లోనే 5 పథకాలు అమలు చేసిన కాంగ్రెస్
- మహిళా ఓటర్లను ప్రభావితం చేస్తున్న మహాలక్ష్మి ,గృహజ్యోతి పథకాలు
- ఆరు గ్యారెంటీలకూ బడ్జెట్ కేటాయించిన కాంగ్రెస్ సర్కార్
- ఆగస్టు 15 లోగా రైతు రుణ మాఫీపై వచ్చిన స్పష్టత
- రేవంత్ పాలనపై పెరిగిన విశ్వాసం అంటున్న రాజకీయ పండితులు
Congress lok sabha elections target with welfare schemes:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు సాధ్యమేనా అని ప్రశ్నించిన విమర్శకుల నోళ్లు మూయిస్తూ దూసుకుపోతోంది అధికార కాంగ్రెస్. ఇప్పటికే ఆరు హామీలలో 5 హామీలు అమలు చేసి తన సత్తా చాటుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ పండితులే ఆశ్చర్యపడేలా కేవలం నాలుగు నెలలకే అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ తో కొన్ని సంక్షేమ పథకాలు ఆగినా కోడ్ తర్వాత వాటిని అమలు చేస్తామని ఆత్మ విశ్వాసంతో చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.
అసెంబ్లీ ఎన్నికల ముందు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల్లో ఇప్పటికే ఐదు అమలయ్యాయి. మిగిలిన ఎనిమిది ప్రారంభోత్సవానికి రెడీ అయ్యేలోగా పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఆటంకంగా మారింది.
మహిళా ఓటర్లే కీలకం
జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మహాలక్ష్మి ,గృహజ్యోతి వంటి పథకాలు మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారంతా తమ పార్టీ వైపు మొగ్గు చూపుతారని కాంగ్రెస్ ధీమాతో ఉంది. ఉచిత బస్సు ప్రయాణ పథకం ఇప్పటికే కోట్ల మంది మహిళలు వినియోగించుకుంటున్నందున వారంతా తమకు మద్దతుగా నిలుస్తారని తెలంగాణ కాంగ్రెస్ ఓ అంచనాకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు, గొర్రెల స్కాం, ఆవుల స్కాం,హెచ్ఎండీఏ అధికారుల అవినీతి తదితర శాఖలో అవినీతి బయటకు వస్తున్న నేపథ్యంలో…..ఈ అంశాలు అన్ని అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారణమైన నిరుద్యోగులకు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎల్బీ స్టేడియం వేదికగా ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తూ నిరుద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఇటు ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ స్పెషల్ డ్రైవ్స్ వంటి కార్యక్రమాలు కూడా తమకు ప్లస్ అవుతాయని కాంగ్రెస్ భావిస్తోంది.
గ్యారెంటీలకు కేటాయించిన నిధులు
నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి గృహజ్యోతి స్కీమ్ కింద మాఫీ కోసం రూ. 2,418 కోట్లు కేటాయించింది కాంగ్రెస్ సర్కార్.
ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం రూ. 22,500 కోట్లు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3,500 చొప్పున మొత్తం నాలుగున్నర లక్షల ఇండ్లు ఇచ్చేలా నిధులు కేటాయించింది. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి నెలకు సుమారు రూ. 250 కోట్లు అని ఆర్టీసీ అంచనా వేసింది. ఏటా దాదాపు రూ. 1,500 కోట్లు అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఒక ఇన్స్టాల్మెంట్గా ఫిబ్రవరిలో రూ. 374 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మహాలక్ష్మి స్కీమ్లోని రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ కోసం మార్చి నెల అడ్వాన్సుగా రూ. 80 కోట్లను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం విడుదల చేసింది. సంవత్సరానికి దాదాపు 40 లక్షల మందికి రూ. 3,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రైతు భరోసాకు ఒక సీజన్కు రూ. 9,650 కోట్ల చొప్పున రెండు సీజన్లకు కలిపి దాదాపు రూ. 19 వేల కోట్లుగా అంచనా. వరి పంటకు క్వింటాల్కు రూ. 500 చొప్పున బోనస్గా ఒక్కో సీజన్కు సగటున కోటి టన్నులకు రూ. 5 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. ఇంతకాలం ‘ఆసరా’ పేరుతో ఉన్న పింఛన్లను ‘చేయూత’ పేరుతో రూ. 4,000కు పెంచినందున ఏటా దాదాపు 18 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది.
అమలైన ఐదు హామీలు:
ఇప్పటికే అమలవుతున్న హామీలతో ప్రజలు రేవంత్ సర్కార్ పట్ల సుముఖంగా ఉన్నారని ఇటీవల వచ్చిన సర్వేలు సూచిస్తున్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల వరకు ట్రీట్మెంట్ పరిధి పె:చారు. డిసెంబరు 9, 2023 నుంచి ఈ పథకం అమలవుతోంది.మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం డిసెంబరు 9, 2023 నుంచి అమలులోకి వచ్చింది. 200 యూనిట్ల (నెలకు) వరకు ఉచిత విద్యుత్ స్కీమ్ ఫిబ్రవరి 27, 2024 నుంచి అమలవుతోంది. ఇక తెల్ల రేషను కార్డు ఉన్నవారికి రూ.500కే వంట గ్యాస్ పథకం ఫిబ్రవరి 27, 2024 నుంచి అమలులోకి వచ్చింది. సొంతిల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కల్పించే స్కీమ్ మార్చి 11, 2024 నుంచి అమలవుతోంది.
కోడ్ ముగియగానే అమలుకు సిద్ధం
మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 చొప్పున మహాలక్ష్మి ఆర్థిక సాయం, రైతు భరోసా పేరుతో రైతులు, కౌలు రైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం, రైతు కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం, వరి పంటకు క్వింటాల్కు రూ. 500 చొప్పున బోనస్ (ఎంఎస్పీకి అదనంగా), ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల చొప్పున ఇంటి స్థలాలు, ప్రస్తుతం ఉన్న రూ. 2,016 పింఛను (ఆసరా)ను ‘చేయూత’ పేరుతో నెలకు రూ. 4,000కు పెంపు, విద్యార్థులకు రూ. 5 లక్షల చొప్పున విద్యా భరోసా కార్డు
ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు వంటి పథకాలను ఈ ఎన్నికల కోడ్ అనంతరం మెదలుపెట్టేందుకు సిద్ధంగా ఉంది కాంగ్రెస్ సర్కార్. .