Health Mission: నేషనల్ హెల్త్ మిషన్లోని ఉన్నతాధికారులు చేస్తున్న నిర్లక్ష్యానికి కింది స్థాయి ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఎన్హెచ్ఎం విభాగం వేతనాలకు సంబంధించిన ఫైల్ను ఇప్పటి వరకు మూవ్ చేయలేదు. పూర్థిస్థాయి వివరాలతో ఫైల్ను రెడీ చేసి, ఎన్హెచ్ఎం ఆఫీస్లోనే ఉంచడం గమనార్హం. సదరు ఫైల్ను హెల్త్ సెక్రటరీకి పంపించేందుకు ఎన్హెచ్ఎం విభాగంలో పనిచేసే కొందరు ఉద్యోగులు జంకుతున్నట్లు సమాచారం. ఆ ఫైల్ సెక్రెటరీ వద్దకు వెళ్తే, మిషన్ అలవెన్స్ ముచ్చట బయట పడుతుందని, భారీ స్థాయిలో ఉన్న అలవెన్స్కు సెక్రెటరీ చెక్ పెట్టే ప్రమాదం ఉన్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ ఆఫీస్లో చర్చ జరుగుతున్నది.
దీంతో ఆ ఫైల్ను సెక్రటేరియట్కు పంపించకుండా ఎన్హెచ్ఎం ఫైనాన్స్ విభాగంలో పెండింగ్ పెట్టారు. పైగా జీతాలకు సంబంధించిన ఫైల్ను గతంలో సెక్రెటరీ పేషీలో పనిచేసిన ఓ కీలక అధికారి కూడా చెక్ చేసి, అంతా ఒకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, సదరు ఫైల్ను హెల్త్ సెక్రెటరీకి ఎందుకు పంపడం లేదనేది చర్చాంశనీయమైంది. తద్వారా ఉద్యోగులకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు వేతనాలు రాకపోవడంతో ఎన్హెచ్ఎం విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా స్కూల్స్ ప్రారంభం సీజన్ కావడంతో పిల్లల ఫీజులు, కుటుంబ పోషణ, ఇతరాత్ర ఖర్చుల నిమిత్తం ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. పెద్ద క్యాడర్ ఉద్యోగుల మేలు కోసం చిన్న ఉద్యోగులను పస్తులు ఉంచడం సరికాదని ఎన్హెచ్ఎం ఉద్యోగి ఒకరు తెలిపారు.
Also Read: IAS Transfers: భారీగా ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్.. పలు జిల్లాలకు ఛేంజ్!
ట్రైనింగ్లో కమిషనర్?
ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖకు కొత్తగా కమిషనర్గా నియమితులైన సంగీత సత్యనారాయణ డీవోపీటీ ట్రైనింగ్ నిమిత్తం ఢిల్లీలో ఉన్నారు. దీంతో ఆ బాధ్యతలను కూడా ప్రస్తుతం హెల్త్ సెక్రెటరీ మానిటరింగ్ చేస్తున్నారు. ఎన్హెచ్ఎం విభాగపు ఫైళ్లన్నీ ఇప్పుడు హెల్త్ సెక్రెటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తూ పరిశీలించాల్సి ఉంటుంది. ఆయా విభాగాల అధికారులు కూడా ఆమె వద్దకే ఫైళ్లు పంపాలి. అయితే, మిగతా ఫైల్స్ అన్నీ హెల్త్ సెక్రెటరీకి పంపిస్తున్న ఎన్హెచ్ఎం అధికారులు, జీతాల ఫైల్ను మాత్రం సెక్రెటరీకి పంపించడం లేదు. దీంతో పలువురు ఉద్యోగుల్లో అనుమానం రేకేత్తింది. పైగా ఈ నెల 17న కొత్త కమిషనర్ డ్యూటీలో చేరతారని, అప్పుడే ఫైల్ పెట్టాలని కొందరు అధికారులు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
30 శాతం అలవెన్స్?
నేషనల్ హెల్త్ మిషన్ ప్రధాన కార్యాలయంలో వేర్వేరు విభాగాల నుంచి కొందరు అధికారులు ఫారెన్ డిప్యుటేషన్ సర్వీస్పై (ఎఫ్ఎస్డీ) పనిచేస్తున్నారు. అయితే, ఆయా ఆఫీసర్లు ‘మిషన్ అలవెన్స్’ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీతానికి అదనంగా 30 శాతం చొప్పున క్లైయిమ్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దాదాపు 15 నుంచి 20 మంది కీలక అధికారులు మిషన్ అలవెన్స్ పొందుతున్నట్లు సమాచారం. ఇప్పుడు వేతనాల ఫైల్ను సెక్రెటరీ చూస్తే ఇవన్నీ మిస్ అవుతాయనే భయంలో ఎన్హెచ్ఎం ఉన్నతాధికారులు ఉన్నారు. దీంతోనే ఆపుతున్నట్లు సమాచారం.
ఏడాదిన్నర తర్వాత మళ్లీ మొదటికి?
నేషనల్ హెల్త్ మిషన్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, పార మెడికల్ స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్ విభాగంలో దాదాపు 20 వేల మందికిపైగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో ఈ విభాగంలోని ఉద్యోగులకు ప్రతి మూడు నెలలకు ఓసారి జీతాలు వచ్చేవి. కొన్నిసార్లు ఆరు నెలల వరకు కూడా వెయిట్ చేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఈ విభాగాన్ని సమీక్షించి, వేతనాలను గ్రీన్ ఛానెల్లో వచ్చేలా చొరవ చూపించారు.
గతంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్గా పనిచేసిన ఆర్వీ కర్ణన్ జీతాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి, ప్రతీ నెల మిస్ కాకుండా జీతాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఆయన ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్గా ట్రాన్స్ఫర్ అయ్యారు. దీంతో ఈ నెల జీతాలు మళ్లీ పెండింగ్ పడ్డాయి. ఏడాదిన్నర తర్వాత మళ్లీ సీన్ మొదటికి వచ్చిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు వర్క్ ఆపితే అస్తవ్యస్తంగా మారిపోతుందని కొందరు ఆఫీసర్లు చెబుతున్నారు.
Also Read: Teacher Eligibility Test: టెట్ అభ్యర్థులకు ‘పరీక్ష’ తప్పట్లేదు.. ఈనెల 18 నుంచి 30వరకు ఎగ్జామ్స్!