Police Suspended: తెలంగాణలో అమానుష ఘటన జరిగింది. వృద్ద రైతు పట్ల ఓ ఏఎస్ఐ ప్రవర్తించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు తావిస్తోంది. భూ భారతి చట్టాన్ని (Bhu Bharathi Act) ప్రజలకు చేరువ చేయాలని ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) భావిస్తుంటే.. దాని కోసం వచ్చిన ప్రజల పట్ల పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా లో జరిగిన ఈ ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
భూభారతి రెవెన్యూ సదస్సును ప్రతీ గ్రామంలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయించింది. ఈ మేరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సు ను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలో ఓ వృద్ధ రైతు అల్లెపు వెంకట్ తన భూమి పట్టా కావడం లేదని చెబుతూ రెవెన్యూ సదస్సుకు వచ్చారు. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా తనకు న్యాయం జరగడం లేదని తహసిల్దారును, రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు.
అమానుష ప్రవర్తన
వృద్ధ రైతును రెవెన్యూ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన ఊరుకోలేదు. దీంతో అక్కడే ఉన్న ఏఎస్ఐ రామ్ చందర్.. రైతుపై జులుం ప్రదర్శించారు. రైతు మెడ పట్టుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నుండి బలవంతంగా బయటకు ఈడ్చుకొచ్చాడు. ఇదంతా చూసి అక్కడి రైతులు అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో.. ఏఐఎస్ తీరును ప్రతీ ఒక్కరు ఖండిస్తున్నారు. అన్నం పెట్టే రైతు పట్ల.. ఆ పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు సరిగా లేదని పేర్కొంటున్నారు.
వృద్ధ రైతుపై ASI జులుం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ లో నిర్వహించిన భూభారతి సదస్సులో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన ఓ వృద్ద రైతును MRO ఛాంబర్ నుండి బయటకు నెట్టేసిన ASI రాంచందర్
రాంచందర్ తీరుపై మండిపడుతున్న రైతులు, ప్రజలు
ఏఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్… pic.twitter.com/oaIne7cZmr
— BIG TV Breaking News (@bigtvtelugu) June 4, 2025
ఘటనపై సీతక్క ఆరా
రైతుపై ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తించిన ఘటనపై నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) స్పందించారు. తహసీల్దార్, రెవెన్యూ అధికారుల ఆదేశాలతోనే ఏఎస్ఐ రామ్ చందర్ అలా ప్రవర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన ఏ మాత్రం సహించమని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు ఫ్రెండ్లీ గా ఉంటారని పేర్కొన్నారు. దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘నిర్మల్ పోలీస్.. మీ పోలీస్’ అని ప్రజలకు దగ్గరవుతున్న సమయంలో ఇలాంటి సంఘటన సహించరానిదని ఎస్పీ అన్నారు. మరోవైపు మంత్రి సీతక్క సైతం ఈ విషయంపై ఆరా తీశారు. దీంతో ఏఎస్ఐను అధికారులు సస్పెండ్ చేశారు.