Bandi Sanjay on BRS: బీఆర్ఎస్ – బీజేపీ పొత్తు, కవిత ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామా అంటూ కొట్టిపారేశారు. బీఅర్ఎస్ – బీజేపి పార్టీలు ఎప్పటికీ కలవవని బండి సంజయ్ స్పష్టం చేశారు. కవిత అరెస్టు (Kavitha Arrest)ని ఆపడానికి బీజేపీ (BJP)తో కలవాలని చుసినప్పుడే తాము దగ్గరికి రానివ్వలేదని బండి సంజయ్ తెలిపారు.
కల్వకుంట్ల ఫ్యామిలీ సినిమా!
బీఅర్ఎస్ అవినీతి పార్టీ అని బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అలాంటి కుటుంబ పార్టీని బీజేపీ దగ్గరకు తీసుకోదని పేర్కొన్నారు. కల్వకుంట్ల అర్ట్ ప్రోడక్షన్ లొ తెలంగాణ చార్ పత్తా సినిమా నడుస్తోందని బండి ఎద్దేవా చేశారు. కవిత, కేటీఆర్ (KTR), సంతోష్ (Santhosh), హరీశ్ రావు (Harish Rao)లు చార్ పత్తా అయితే కేసీఆర్ (KCR) జోకర్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ కలవడం నిజమేనన్న రాజాసింగ్ (MLA Raja Singh) వ్యాఖ్యలపై ప్రశ్న ఎదురుకాగా.. ఆయన్నే అడగాలని బండి సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్, బీఅర్ఎస్ అడ్టుకోవాలని చూసినా.. బీజేపి ప్రస్థానం అగదని బండి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు అవకాశమిచ్చామని.. ఈసారి బీజేపీకి అధికారం ఇద్దామన్న అలోచనలో తెలంగాణ సమాజం ఉందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై
జై హింద్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు.. భారత సైనికులను కించ పరిచే విధంగా ఉన్నాయని బండి సంజయ్ విమర్శించారు. భారత అర్మీ చీఫ్ (Indian Army Chief) మీద మీకు విశ్వాసం లేదా? అంటూ ప్రశ్నించారు. పహల్గాం (Pahalgam Terror Attack) సంఘటన జరిగిన 15 రోజులలోనే ఉగ్రవాదులని చంపినట్లు బండి స్పష్టం చేశారు. ఉగ్రవాదం అంతమయ్యే వరకూ ఈ యుద్ధం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సైతం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. పాక్ పై యుద్ధం గురించి ఇన్ని విమర్శలు చేసే కాంగ్రెస్ పార్టీ (Congress Party).. వారి హయాంలో పీవోకే (POK)ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీశారు. అటు ఈటెల రాజేందర్ (Etela Rajender), హరీశ్ రావు కలిసారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ (Mahesh Kumar Goud) చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆ మాటలు తాను వినలేదని బండి సమాధానం దాటవేశారు.
18 నెలలుగా డైవర్షన్ పాలిటిక్స్
మరోవైపు ధాన్యం కొనుగోళ్లు అంశంపై కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ళు కోసం తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ. 2 లక్షల కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. వరి, ఇతర పంటలకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర అందిస్తోందని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.. వరిధాన్యానికి బోనస్ ఇస్తానని చెప్పి సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అటకెక్కించిందని బండి సంజయ్ ఆరోపించారు. అరు గ్యారంటీలు (Six Gaurantee) అడిగినప్పుడల్లా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. 18 నెలలుగా ఈ డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం, ఫార్ములా కేసు, డ్రగ్స్ కేసులు పత్తా లేకుండా పోయాయనని అన్నారు. నిందితులను అరెస్ట్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదని చెప్పారు.