L&T On Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం.. తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిదంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అయితే బ్యారేజీ ఏడో బ్లాక్ కుంగిపోవడం వెనక నాణ్యతా లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సైతం తన రిపోర్ట్ లో తేల్చింది. అయితే దానిని కప్పిపుచ్చుకునేందుకు నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీ వ్యవహరిస్తున్న వైఖరి ప్రస్తుతం చర్చకు తావిస్తోంది. ఎన్డీఎస్ఏ రిపోర్టునే తప్పుబడుతూ తాజాగా ఇరిగేషన్ శాఖకు ఎల్అండ్ టీ లేఖ రాయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రామగుండం ఎస్ఈకి లేఖ
మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు, అనంతరం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థకు మే రెండో వారంలో తెలంగాణ నీటిపారుదలశాఖ లేఖ రాసింది. బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నాయంటూ ఎన్టీఎస్ఏ ఇచ్చిన రిపోర్టును సైతం దానికి జత చేసింది. దీనిపై ఎల్అండ్ టీ సంస్థ సమాధానమిస్తూ రామగుండం ఎస్ఈకి తిరిగి లేఖ రాసింది. అందులో కేంద్ర సంస్థ అయిన ఎన్డీఎస్ఏ రిపోర్టుపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ రిపోర్ట్ లో చాలా తప్పులు ఉన్నాయని పేర్కొంది.
ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై అభ్యంతరం
బ్యారేజీ డిజైన్లకు సంబంధించి జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఎన్డీఎస్ఏ సరిగా చేయలేదని ఎల్అండ్ టీ సంస్థ లేఖలో ఆరోపించింది. తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ లేబొరేటరీ సంస్థ సరిగా మోడల్ స్టడీస్ చేయలేదని చెప్పింది. హైడ్రాలిక్, స్ట్రక్చర్ డిజైన్లలో లోపాలు ఉన్నాయని అభిప్రాయపడింది. నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ఎన్డీఎస్ఏ చెప్పడానికి ఎలాంటి సరైన ఆధారాలను చూపించలేదని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేసింది.
నిర్మాణంలో నాణ్యత పాటించాం
ఎలాంటి సాంకేతిక పరీక్షలు లేదా సమగ్ర విచారణ జరపకుండా బ్యారేజీలో నాణ్యతా లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ ఎలా నిర్ధారించిందని లేఖలో ఎల్అండ్ టీ ప్రశ్నించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో తాము నాణ్యతా నియంత్రణ పాటించామని.. డిజైన్లో లోపాలు లేవని ఎల్అండ్టీ స్పష్టం చేసింది. అదనంగా బ్యారేజీ వైఫల్యానికి సంబంధించిన కారణాలను తాము స్వతంత్రంగా అధ్యయనం చేసినట్లు పేర్కొంది. బ్లాక్ 7ను పునరుద్ధరించవచ్చని బ్యారేజీని మళ్లీ వినియోగించుకోవచ్చని.. ఎల్అండ్టీ తమ నివేదికలో పేర్కొంది.
ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సమీక్షించాలి!
అంతేకాదు క్వాలిటీ కంట్రోల్కు సంబంధించి ఎన్డీఎస్ఏ 2024 మార్చి 21న అడిగిన అన్ని ప్రశ్నలకు తాము సమాధానం ఇచ్చినట్లు ఎల్అండ్ టీ తన లేఖలో స్పష్టం చేసింది. క్వాలిటీ చెక్కు సంబంధించిన ఆధారాలు.. ప్రతి మూడు నెలలకోసారి సదరు డిపార్ట్ మెంట్ సంతృప్తి చెందుతూ ఇచ్చిన రిపోర్టులను ఎన్డీఎస్ఏకు అందజేసినట్లు చెప్పింది. అయినా రిపోర్టులో క్వాలిటీ కంట్రోల్ మేనేజ్ మెంట్ నిర్వహించలేదని చెప్పడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఎల్అండ్ టీ పేర్కొంది. ఎన్డీఎస్ఏ రిపోర్టును.. తెలంగాణ నీటిపారుదల శాఖ ఒకసారి పునః సమీక్షించాలని కోరింది. రిపోర్ట్ తిరిగి అప్డేట్ చేయించాలని సూచించింది.
కంప్లీషన్ సర్టిఫికెట్పై తొందరపాటు
అయితే మేడిగడ్డ బ్యారేజ్ పనులు పూర్తికాకముందే కాంప్లీషన్ సర్టిఫికేట్ కోసం ఎల్ అండ్ టీ సంస్థ బాగా తొందరపడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019 జూన్ 21న నాటి సీఎం కేసీఆర్.. మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించగా.. అప్పటికీ పనులు పూర్తి కాలేదు. రూ.150 కోట్లకు పైగా విలువైన పనులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఆ పనులు పూర్తి చేయకుండానే కంప్లీషన్ లెటర్ ఇవ్వాలని ఎల్అండ్ టీ సంస్థ ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఇందుకోసం ప్రాజెక్ట్ కు ఈఈకి 2019 ఆగస్టు 6న ఎల్అండ్ టీ సంస్థ లేఖ సైతం రాసినట్లు తెలుస్తోంది. అయితే బ్యారేజీలో డ్యామేజ్ ఉందని.. డిఫెక్ట్ లైయబిలిటీ కింద వాటిని పూర్తి చేయాలని అధికారులు సూచించారు. అవేమి చేయకుండా మళ్లీ 2020, 2021లో ఎల్అండ్ టీ రెండు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ ఒత్తిడి, నాటి ప్రభుత్వ పెద్దల నిర్ణయంతో కంప్లిషన్ సర్టిఫికేట్ ను అధికారులు ఇవ్వకతప్పలేదని తెలుస్తోంది.
Also Read: Pawan Kalyan – Chandrababu: చంద్రబాబుపై పవన్ పొగడ్తల వర్షం.. మామూల్గా ఆకాశానికెత్తలేదు భయ్యా!
ఆ బాధ్యత ప్రభుత్వానిదే!
కాంట్రాక్ట్ ప్రకారం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో జరిగిన డ్యామేజీలకు నిర్మాణ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాటికి సంస్థనే రిపేర్లు చేయించాలి. కానీ, ఇప్పుడు ఎల్అండ్టీ మాత్రం.. వాటి ఖర్చులు ప్రభుత్వమే భరించాలంటూ మెలిక పెడుతున్న సమాచారం. ఈ మేరకు నీటిపారుదల శాఖకు ఎల్అండ్ టీ సంస్థ లేఖ సైతం రాసినట్లు సమాచారం. బ్యారేజ్ రిపేర్ పనులు ప్రభుత్వమే చేయించుకోవాలని సూచించినట్లు సమాచారం. కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చిన తేదీ నుంచి చూసుకుంటే.. ఓ అండ్ఎం యాక్టివిటీస్ కూడా ఐదేండ్లు సంస్థే చూసుకోవాలి. ఇన్ని అంశాలు ఎల్అండ్ టీ సంస్థ వైపు వేలెత్తి చూపిస్తున్నా ఎన్డీఎస్ఏ రిపోర్టులోని అంశాలే తప్పు అని ఎల్ అండ్ టీ సంస్థ లేఖ రాయడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.