తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: 72 మిస్ వరల్డ్ పోటీల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కార్న్వాల్కు చెందిన లైఫ్గార్డ్ అయిన మిల్లా మాగీ తన తల్లి ఆరోగ్యం బాగ లేదని, వ్యక్తిగత కారణాలతో ఆకస్మాత్తుగా మిస్ వరల్డ్ పోటీల నుంచి నిష్క్రమించడం వివాదానికి దారి తీసింది. మిల్లా గతేడాది ప్రతిష్టాత్మకమైన మిస్ ఇంగ్లాండ్ టైటిల్ను గెలుచుకుంది. ఆమె తన తల్లి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ అత్యవసర పరిస్థితుల రీత్యా పోటీల నుంచి వైదొలగుతున్నట్లు మిస్ వరల్డ్ సంస్థ సీఈవో జూలియా మోర్లేకు తెలిపింది. దీంతో ఆమెను తిరిగి స్వదేశానికి పంపించడానికి మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మిస్ ఇంగ్లండ్ మిల్లా క్షేమంగా స్వదేశానికి చేరుకున్న అక్కడి ‘సన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేయడం పెద్ద దుమారం చెలరేగింది. ఆమె వైదొలగడం, అనంతరం స్వదేశానికి వెళ్లి ఆరోపణలు చేయడం మిస్ వరల్డ్ పోటీలపై చర్చకు దారి తీసింది. అయితే, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆమె ఆరోపణలను ఖండించింది. పోటీల ప్రారంభ సమయంలో ఆమె వ్యక్తపరిచిన అభిప్రాయానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ను విడుదల చేశారు.
వేశ్యలా చూస్తున్నారు: మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ
‘మిస్ వరల్డ్ 2025 పోటీల్లో కంటెస్టెంట్లను వేశ్యలా భావించారు. మిస్ వరల్డ్ పోటీ కాలం చెల్లింది. పాత విలువల్లో చిక్కుకుంది.’ అని విమర్శించింది. స్పాన్సర్ల ముందు ప్రదర్శన చేయాలని, మేకప్తో సాయంత్రం గౌన్లు ధరించమని ఒత్తిడి చేసినట్లు ఆమె పేర్కొంది. మార్పు తీసుకురావడానికే అక్కడికి వెళ్లాను. ‘మేం కోతుల ప్రదర్శనలా కూర్చోవాల్సి వచ్చింది.’ అని ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీల్లో ఇద్దరు బ్యూటీలకు ఒక్కో టేబుల్ చొప్పున కేటాయించారు. పోటీదారులు అతిథులతో కూర్చుని వినోదం అందించాల్సి వచ్చిందని, తాను మద్దతిచ్చే కారణాల గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని పేర్కొంది. నిర్వాహకులు తమను అగౌరవంగా అభివర్ణించారని, చిన్నచూపుచూశారని చెప్పుకొచ్చింది. 109 మంది ఫైనలిస్టులను బోరింగ్ అని తిట్టారని ఆమె ఆరోపించింది. ‘‘1960ల నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో ఎలాంటి మార్పులేదు. ఇలాంటి విలువల్లేని చోట నేను ఉండలేపోయాను. అందుకే మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు” మిస్ ఇంగ్లాండ్ మిల్లా ప్రకటించారు. ‘ఆరుగురు అతిథులు ఉన్న ప్రతి టేబుల్ కు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సాయంత్రం వారితో కూర్చోవాలి. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వినోదం అందించాలి. అది నాకు నచ్చలేదు. ఇది చాలా తప్పు అని నేను అనుకున్నా.. ప్రజల వినోదం కోసం నేను ఇక్కడి రాలేదని’’ ఆమె చెప్పుకొచ్చారు. అయితే, వ్యక్తిగత కారణలతో నిష్క్రమిస్తున్నట్లు ప్రకటిస్తూనే పోటీలపై సంచలన ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో, అందరి దృష్టి మిస్ వరల్డ్ పోటీలపై వైపు మళ్లింది. అసలు ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.
మిల్లా తల్లి ఆరోగ్యం బాగలేదని తప్పుకున్నది: మిస్ వరల్డ్ సంస్థ ఛైర్పర్సన్ జూలియా మోర్లే
72వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ 2025 – మిల్లా మాగీ వైదొలగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ ఛైర్పర్సన్, సీఈవో జూలియా మోర్లే శనివారం స్పందించారు. మిస్ ఇంగ్లాండ్ మాగీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ నెల ప్రారంభంలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తన తల్లి, కుటంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగా ఈ పోటీల నుంచి తప్పుకుంటానని తాను సంస్థను కోరినట్లు ఆమె తెలిపారు. మిల్లా పరిస్థితిని అర్థం చేసుకొని జూలియా మోర్లే వెంటనే స్పందించి ఆమె కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా పరిగణించారు. తక్షణమే ఆమెను ఇంగ్లాండ్కు తిరిగి పంపే ఏర్పాట్లు చేసినట్లు మోర్లే తెలిపారు. ఇటీవల బ్రిటిష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై కొన్ని యూకే మీడియా సంస్థలు మిల్లా మాగీ పోటీల్లో ఎదుర్కొన్న అనుభవాలపై తప్పుడు, అవాస్తవాలను కథనాల రూపంలో ప్రచురించారన్నారు. పత్రికల్లో వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఆ కథనాలు పూర్తిగా నిరాధారమైనవని జూలియా మోర్లే పేర్కొన్నారు. మిస్ వరల్డ్ సంస్థ నిజాయితీ, గౌరవం, “బ్యూటీ విత్ ఎ పర్పస్” విలువలకు కట్టుబడి ఉందని, నిబద్ధతగా పోటీలు జరుగుతున్నాయన్నారు. మీడియా సంస్థలు జర్నలిస్టిక్ విలువలు పాటించాలని సూచించారు. మీడియా సంస్థలు తమ వనరులను సరిగ్గా ధృవీకరించి, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచురించకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆధారాలతో న్యూస్ ప్రచురించాలని, అందుకు సంబంధించిన వారి వివరణ తీసుకోవాలని జూలియా మోర్లే విజ్ఞప్తి చేశారు.
– మిల్లా వీడియో బైట్, వీడియో ఫుటేజ్ రిలీజ్..
మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తీవ్ర ఆరోణపలు చేయడంతో ఆమె వీడియో బైట్స్, వీడియో ఫుటేజ్లు బయటకు వచ్చాయి. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ సమయంలో మిల్లా మాగీ స్వయంగా వ్యక్తపరిచిన భావాలకు సంబంధించిన ఎడిట్ చేయని వీడియో క్లిప్ లను మిస్ వరల్డ్ సంస్థ శనివారం విడుదల చేసింది. అందులో ఆమె ఆనందాన్ని, కృతజ్ఞత, అనుభవాన్ని వ్యక్తపరిచింది. ఇక్కడి హాస్పటాలిటీ, ఫుడ్ బాగుందని మెచ్చుకున్న వీడియోలు రిలీజ్ చేసింది. తాజాగా ప్రచురితమైన కథనాలు నిరాధారమైనవని, ఆ ఆరోపణలను సంస్థ ప్రతినిధులు ఖండించారు.
– ఇంగ్లాండ్ తరఫున మిస్ షార్లెట్ ప్రాతినిధ్యం..
మిస్ ఇంగ్లండ్ మిల్లా పోటీల నుంచి వైదొలగడంతో ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ మొదటి రన్నరప్ అయిన మిస్ షార్లెట్ గ్రాంట్ (25) ఇంగ్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారు. బుధవారం మిస్ షార్లెట్ ఇండియాకు చేరుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు అవకాశం కల్పించారు.
అసలు కారణాలివే
మిల్లా వ్యక్తిగత కారణాలతో యూకే వచ్చింది : మిస్ ఇంగ్లాండ్ డైరెక్టర్ ఆంజీ బీస్లీ
మిల్లా వ్యక్తిగత కారణాలతో యూకేకి తిరిగి వచ్చిందని మిస్ ఇంగ్లాండ్ డైరెక్టర్ ఆంజీ బీస్లీ తెలిపారు. ‘ఆమె నిర్ణయానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. ఆరోగ్యం ఫస్ట్ ప్రాధాన్యం ఇస్తున్నాం. మిల్లా స్థానంలో మిస్ ఇంగ్లాండ్ మొదటి రన్నరప్ షార్లెట్ గ్రాంట్ ప్రస్తుత మిస్ లివర్పూల్, మిస్ వరల్డ్ ఫైనల్లో ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. షార్లెట్ కు ఇండియా సోదరభావంతో స్వాగతం పలికిందని’ పేర్కొన్నారు.