Chamala Kiran Kumar: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. చెల్లి కవిత (Kalvakuntla Kavitha) చేసిన లొల్లికి కేటీఆర్ (KTR) కవిత్వంతో బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. చెల్లి లొల్లిని కవర్ చేస్తూ ఏదోటి చెప్పాలని ఆయన మీడియా ముందుకు వచ్చారని మండిపడ్డారు. కవిత మాటలకు రాత్రంతా నిద్ర పట్టక పొద్దున్నే వచ్చి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపణలు చేశారని విమర్శించారు.
కేటీఆర్.. కలలు కంటున్నారు!
నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case)కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ కేసుకు రేవంత్ ఎందుకు బాధ్యత వహించాలో చెప్పాలని నిలదీశారు. 2012లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy).. నేషనల్ హెరాల్డ్ పై కేసు వేశారని గుర్తుచేశారు. గత 11 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉందని.. ఏదైనా తప్పు జరిగి ఉంటే ఈ పాటికే నిరూపితమయ్యేదని చామల అన్నారు. కేటీఆర్ రాజ్యమేలదామని రాత్రిపూట కలలుకుంటున్నారని విమర్శించారు. రాజుకి బదులు వికటకవి అవతారం ఎత్తుతున్నారని సెటైర్లు వేశారు.
కవిత ఆరోపణలకు ఆన్సర్ ఇవ్వు!
తల తోకా సంబంధం లేకుండా నేషనల్ హెరాల్డ్ పై కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారని ఎంపీ చామల విమర్శించారు. చెల్లి లొల్లి పక్క దారి పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు. ఎప్పుడో జరిగిన కేసును ఇవాళ తీసుకొచ్చి సీఎం రేవంత్ కుంభకోణం చేసినట్లుగా ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత చేసిన ఆరోపణలపై మీడియా సమావేశం నిర్వహించి కేటీఆర్ సమాధానాలు చెప్పాలని పట్టుబట్టారు. కేసీఆర్ వద్ద ఉన్న దెయ్యాలు.. అవి చేసిన కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తునకు కవిత లేఖ రాయాలని సూచించారు. ఇంటి పంచాయతీని రాజకీయం చేయాలనుకుంటే కవితను తెలంగాణ ప్రజలు నమ్మరని స్పష్టం చేసారు.
Also Read: Mallu Ravi – Ponnam: నోరు జాగ్రత్త.. చెప్పులకు పని చెప్తాం.. కేటీఆర్కు ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్!
కవితకు ఆ విషయం అర్థమైంది!
మరోవైపు కవిత రాసిన లేఖపై మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి (Yennam Srinivas Reddy) స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో తనకు గుర్తింపు లేదని కవితకు అర్థమైందని అన్నారు. అందుకే తన భవిష్యత్తు కోసం ఆమె ప్రత్యామ్నయం చూసుకుంటున్నారని చెప్పారు. మళ్ళీ పార్టీలో గుర్తింపు పొంది ఆస్తులు కూడబెట్టాలని కవిత చూస్తోందని అన్నారు. నా దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ (Telangana BJP) చెప్పుకోవడం విడ్డూరమని పేర్కొన్నారు. ఎవరి లబ్దికోసం వారు ఇష్టం వచ్చినట్లు రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.