Kavitha: అవును.. ఎన్నో ఊహాగానాలు, అంతకుమించి అంచనాలు సీన్ కట్ చేస్తే వాటన్నింటినీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకే ఒక్కమాటతో ఉసూరుమనిపించారు. లేఖ బయటికొచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు అన్నీ ఇన్నీకావు. అదిగో పార్టీ, ఇదిగో ప్రకటన అన్నట్లుగా రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు బీఆర్ఎస్ నేతలు ఒక్కరంటే ఒక్కరూ ఆఖరికి కల్వకుంట్ల ఫ్యామిలీ పెద్దలు (KCR Family) కూడా స్పందించలేదు. మరోవైపు సరిగ్గా కవిత అమెరికా నుంచి వస్తుండగా స్వాగతం చెబుతూ ప్రత్యేకంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు.. అంతకుమించి నినాదాలు, ప్లకార్డులు, ఎక్కడా గులాబీ పార్టీ నేతలు, జెండాలు కనిపించకపోవడంతో ఇవన్నీ చూసిన టీవీల్లో, యూట్యూబుల్లో చూసిన జనాలు ఇక కొత్త పార్టీ ప్రకటనే ఆలస్యం అన్నట్లుగా సీన్ క్రియేట్ అయ్యింది. నరాలు తెగే ఉత్కంఠతో తెలంగాణ ప్రజానీకం, వారితో పాటు బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాయి. వీటన్నింటికీ మించి ఆమె అభిమానులు, కొందరు జనాలు వేసిన అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ప్రెస్మీట్లో పార్టీ ప్రకటన లేకపోవడంతో కవిత ఉసూరుమనిపించారని బీసీ నేతలు, అభిమానులు, మహిళలు నిష్టూర్చినట్లుగా స్పష్టంగా చూడొచ్చు.
Read Also- Kavitha: కవిత లేఖ తర్వాత కీలక పరిణామం.. తేల్చేసిన కేసీఆర్.. కొత్త పార్టీ పక్కా!?
తేల్చేసిన కవిత..
‘ కేసీఆర్ గారు దేవుడు. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. నాకు వ్యక్తిగత అజెండా అంటూ ఏమీ లేదు. రెండు వారాల క్రితం లేఖ రాశాను. లేఖ రాసిన మాట వాస్తవమే. లేఖ రాయడంలో పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం కుట్రే. లేఖ బహిర్గతం వెనుక ఎవరున్నారో తెలియాలి. లేఖ లీక్ చేసింది పార్టీలోని కొందరు కోవర్టులే. కోవర్టులను పక్కన పెట్టాలి. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ముందుకెళ్తుంది. పార్టీలో ఏం జరుగుతోందో ఆలోచించుకోవాలి. అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి? నా లేఖే బయటకు వచ్చిదంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి? నేను గతంలోనూ కేసీఆర్కు లేఖలు రాసేదాన్ని. పార్టీలోని వ్యక్తులే లెటర్ లీక్ చేశారు. కుటుంబం, పార్టీ ఐక్యంగానే ఉన్నాయి. మా నాయకుడు కేసీఆరే.. ఎలాంటి ఇతర ఆలోచన లేదు. నేను ఏ విషయమైనా సరే లేఖ ద్వారా మాత్రమే చెబుతాను. పార్టీని అన్ని స్థాయిల్లోని నాయకులు అనుకుంటున్న విషయాలనే లేఖలో పెద్ద ఎత్తున చెప్పాను. మళ్లీ చెబుతున్నాను.. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది. కేసీఆరే మా నాయకుడు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తాం. పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్ ఉంటుందని నా అభిప్రాయం’ అని కవిత రెండు మాటలతోనే తేల్చేశారు.
ప్చ్.. ఇలా అయ్యిందేంటో!
అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన కవిత అభివాదం చేస్తూ బయటికొచ్చారు. ఈ క్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. టీమ్ కవితక్క అని కొందరు.. ‘సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితకు స్వాగతం.. సుస్వాగతం’ అంటూ మరికొందరు బ్యానర్లతో కనిపించారు. ఇక నినాదాలు, అరుపులు, కేకలు అంటారా లెక్కేలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత సంచలన ప్రకటన చేసేస్తున్నారు.. ఇక బీఆర్ఎస్లో ఉండరన్నట్లుగా పరిస్థితులు కనిపించాయి. అంతేకాదు కవితను ‘సీఎం.. సీఎం.. సీఎం’ అంటూ అభిమానులు, మహిళలు నినాదాలతో హోరెత్తించారు. ఎయిర్పోర్టు మొత్తం కవిత అభిమానులు, మహిళల నినాదాలు, ఫ్లెక్సీలు, ప్లకార్డులతోనే నిండిపోయింది. దీంతో కవిత ప్రకటన ఏం చేస్తారు? అనేదానికి మరింత టెన్షన్ పెరిగింది. కవిత ప్రకటన కోసం బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు వేయి కళ్లతో ఎదురుచూశాయి. తీరా చూస్తే.. కొత్త పార్టీ లేదు, ఉన్న పార్టీ చాలన్నట్లుగా చెప్పేసి.. లేఖ గురించి మూడు మాటలు మాట్లాడి, లేఖ లీక్ కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సైలెంట్గా ప్రెస్మీట్ ముగించేశారు.
Read Also- Kavitha: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కేసీఆర్ను ప్రశ్నిస్తూ కవిత లేఖ