Indiramma Housing scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన ప్రకారం ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బేస్ మెంట్ పూర్తిచేసుకున్న 1,383 ఇండ్లకు, గోడలు పూర్తయిన 224 ఇండ్లకు రూ.16.07 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
మొత్తంగా ఇప్పటివరకు బేస్ మెంట్, గోడలు పూర్తిచేసుకున్న 5,364 లబ్ధిదారులకు రూ,53.64 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. హైదరాబాద్ లో ఆయన సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా లబ్ధిదారుల చెల్లింపులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 20,104 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. ఇందులో 5,140 ఇండ్లు బేస్మెంట్, 300 ఇండ్లు గోడల నిర్మాణం, మరో 10 ఇండ్లు శ్లాబ్ వరకు పూర్తయ్యాయని తెలిపారు.
Also Read: KTR on CM Revanth: పాతబస్తీ సంఘటనపై కేటీఆర్ ఆరా.. అవి ఉంటే ప్రాణ నష్టం తగ్గేది!
మధ్యవర్తుల ప్రమేయానికి తావులేకుండా నాలుగు విడుతల్లో లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలోనే నిధులు జమ చేస్తున్నట్లు తెలిపారు. బేస్ మెంట్ పూర్తయిన తర్వాత రూ.1 లక్ష, గోడలు పూర్తయిన తర్వాత రూ.1.25 లక్షలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న తర్వాత రూ.1.75 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన రూ.1 లక్ష విడుదల చేస్తామని మంత్రి వివరించారు. వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తిజరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.