Whip Adi Srinivas: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి.. మూడు గంటలకు పైగా సమావేశమయ్యారని చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సమయం ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలు వంటివి చేసినట్లు విప్ చెప్పారు.
4 డీఏలు పెండింగ్ పెట్టారు
ప్రతి నెలా మొదటి తేదీనే ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోలేదని గుర్తుచేశారు. 15వ తేదీ తర్వాతే ఆ నాడు ఉద్యోగులకు జీతాలు పడేవని గుర్తుచేశారు. మొత్తం నాలుగు డీఏలు ఇవ్వకుండా కేసీఆర్ పెండింగ్ లో పెట్టి వెళ్లారని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక డీఎ ఇచ్చినట్లు చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి రూ.8 వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం బకాయి పెట్టిందని అన్నారు.
ప్రతినెలా రూ.600 కోట్లు
ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల కాంగ్రెస్ హయాంలో వేల మంది ఉద్యోగులు ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారని స్పష్టం చేశారు. ఆ భారమంతా ప్రభుత్వం పైన పడుతోందని చెప్పారు. అయినా బకాయిలు చెల్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రతి నెల రూ.600 కోట్ల రూపాయలు కేటాయిస్తామని మా ఆర్థిక మంత్రి ఇప్పిటకే ప్రకటించిన విషయాన్ని విప్ గుర్తు చేశారు.
ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు
ఉద్యోగుల బదిలీల కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశామని.. సమస్యలు తెలుసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ కూడా పెట్టామని విప్ పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు 57 సమస్యలను ప్రస్తావిస్తే అందులో 45కి పైగా తక్షణమే పరిష్కరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్, హరీష్ రావుకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తుకు వచ్చారని.. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా వారిని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలో అందరిని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటామని విప్ హామీ ఇచ్చారు.