Operation Sindoor: భారత సాయుధ బలగాలు కొనసాగిస్తున్న ఆపరేషన్ సింధూర్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాక్ పై వైమానిక దాడుల నేపథ్యంలో సీఎం రేవంత్.. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Center)లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో భేటి అయ్యారు. దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న నేపథ్యంలో భద్రతాపరంగా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు అనుగుణంగా ఆయా విభాగాల అధిపతులకు కీలక సూచనలు చేశారు.
సెలవులు రద్దు
పాక్ పై వైమానిక దాడుల నేపథ్యంలో దేశ సైన్యంతో మనమంతా ఉన్నామన్న సందేశాన్ని ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావులేదని స్పష్టం చేశారు. మరోవైపు అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు సీఎం అన్నారు. ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విదేశీ పర్యటనలు ఏమైనా ఉంటే రద్దు చేసుకోవాలని చెప్పారు.
వారిని అదుపులోకి తీసుకోండి
ప్రభుత్వ ఉద్యోగులు.. మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ (Toll Free Number) ఇవ్వాలని ఉన్నాధికారులను ఆదేశించారు. మరోవైపు పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థను సైతం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఫేక్ న్యూస్ పై ఉక్కుపాదం
శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైనా కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిలువలు సిద్దం చేసుకోవాలని చెప్పారు. అలాగే అత్యవసర మెడిసిన్ సైతం రెడీగా ఉండాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల అందుబాటుపైనా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని అన్నారు. సైబర్ సెక్యూరిటీ అప్రమత్తంగా ఉంటూ.. ఫేక్ న్యూస్ (Fake News) ప్రచారం చేసే వారిపై ఉక్కు పాదం మోపాలని సీఎం అన్నారు.
సీసీ కెమెరాల అనుసంధానం
ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి.. వాటిని అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయాలని అన్నారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతను పెంచాలని ఆదేశించారు.
Also Read: India on Pakistan: పాక్ పై భారత్ భీకర ఆపరేషన్స్.. ఒక్కోటి ఒక్కో మినీ యుద్ధమే!
హైదరాబాద్ లో అలర్ట్
హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల దగ్గర భద్రతను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగర పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం.. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలని సూచించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు.