TG Heavy rains: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో భానుడి భగ భగలు అధికంగా ఉంటోంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇవాళ నుంచి 5 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన చేసింది.
ఉరుములతో కూడిన వర్షం
ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతుందని సూచించింది. ఈ మేరకు వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert) జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) ఇచ్చింది.
పిడుగులతో కూడిన వర్షం
తెలంగాణలోని హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని అంచనా వేసింది. గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఆ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
మరోవైపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని అభిప్రాయపడింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
Also Read: Vishaka Metro: విశాఖలో మెట్రో పరుగులు షురూ.. ప్రభుత్వం కీలక ముందడుగు!
తగ్గనున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో నాలుగు రోజుల వర్షసూచన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర తగ్గనున్నాయి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు.. 36-40డిగ్రీల వరకు నమోదు అవుతాయని వాతావరణ శాఖ సూచించింది.