Sand Mafia: ఇసుక మాఫియా చెరువులు, కుంటలు, వాగుల్లో క్వారీలు పెట్టి మోటార్లతో మట్టిని కడిగి ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తూ పొలాల్లో డంపు చేసుకున్నారు. ఆర్డర్పై ఇసుకను సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకను ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ట్రాక్టర్ కు రూ.5,000- రూ.6,000 అవుతుంది. కానీ అక్రమంగా తక్కువ ఖర్చుతో తయారు చేసిన ఫిల్టర్ ఇసుక మాత్రం రూ.4వేల నుంచి రూ. 5 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
ఇసుక వ్యాపారుల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. జిల్లాలో ఫిల్టర్ ఇసుక దందా జోరుగా సాగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కుంటలు, వాగుల్లో కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ఫిల్టర్ ఇసుకను తయారు చేస్తున్న వారి ఆగడాలను సంబంధిత అధికారులు అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
గోనుపాడు, సంగాల కేంద్రంగా
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాలకు కూతవేటు దూరంలో గల గద్వాల మండల పరిధిలోని గోనుపాడు గ్రామంలో ఇద్దరు, సంగాల గ్రామ శివారుల్లో ముగ్గురు ఇసుక దందా చేస్తుండగా, ధరూర్ మండలం పార్చర్ల గ్రామ శివారులో ఫిల్టర్ ఇసుక దందా జోరుగా సాగుతోంది. ధరూర్ మండలం గూడెందొడ్డి రిజర్వాయర్ లో భాగంగా 99 ప్యాకేజి కాలువను నిర్మించారు. గోనుపాడు, సంగాలకు చెందిన అక్రమార్కులు కాలువ మట్టి, వాగులోని మట్టితో కూడిన ఇసుకను ఫిల్టర్ చేస్తూ గృహ నిర్మాణదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని కృతిమ ఇసుక దందాకు లేపుతున్నారు.
99 ప్యాకేజీ కాలువలో నిలిచిన నీటిని మోటర్ల ద్వారా పంపింగ్ చేసి, మట్టిని, ఇసుకను వేరు చేస్తున్నారు. ఇలా రోజూ 4 నుంచి 10 ట్రాక్టర్ ల ఇసుకను తయారు చేసి, గద్వాల పట్టణం, ధరూర్ మండలంలోని పలు గ్రామాలకు తరలిస్తున్నారు. అలాగే సంగాల గ్రామ శివారులో గల చెరువు వెనుకాల చెరువు మట్టి ద్వారా ఫిల్టర్ ఇసుక దందాను ఆ గ్రామ ఇసుక మాఫియా నిర్వహిస్తున్నారని ఆరోపణలున్నాయి.
Also read: TG Heavy rains: చల్లని కబురు.. రాష్ట్రంలో 5 రోజులు వర్షాలే వర్షాలు!
ఇలా ధరూర్, గద్వాల మండలాలో దర్జాగా పట్టపగలే ఫిల్టర్ ఇసుకను ట్రాక్టర్ ల ద్వారా ఆన్లైన్ ఇసుక మాదిరిగా ట్రాక్టర్ పై కవర్ కప్పుకుని తరలిస్తున్నా అధికారులు, పోలీసులు ఎవరు అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల సహకారంతోనే ఈ అక్రమ దందా కొనసాగుతోందన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. గ్రామాలకు దూరంగా ఉండడంతో దట్టమైన ముళ్లపొదల మధ్య వ్యవహారం గుట్టుగా జోరుగా సాగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఫిల్టర్ ఇసుక తయారీపై ఫిర్యాదులు వచ్చిన సందర్భంలో అధికారులు, పోలీసులు హల్చల్ చేస్తారని, తర్వాత మళ్లీ పరిస్థితి యధావిధిగా మారుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో నిర్మాణం చేపటగా కృత్రిమ ఇసుక వల్ల నిర్మాణంలో నాణ్యత లోపించి ఇంటి పగుళ్లతోపాటు లీకేజీలు ఏర్పడి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గృహ నిర్మాణదారులు వాపోతున్నారు.
చర్యలు తీసుకునేరా…
గద్వాల మండలంలోని సంగాల, గోన్ పాడు గ్రామాలలో చేస్తున్న అక్రమ ఇసుక ఫిల్టర్ దందాపై గద్వాల ఎమ్మార్వో మల్లికార్జున్ వివరణ కోరగా ఈ విషయం మా దృష్టికి రాలేదని ఆర్ఐ, వీఆర్వోను క్షేత్రస్థాయికి పంపి దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని, మరోసారి అక్రమ ఇసుక దందాకు పాల్పడకుండా కేసులు నమోదు చేపిస్తామని స్వేచ్ఛ ప్రతినిధికి తెలిపారు.
గట్టు మండలంలో సైతం..
అధికారుల దాడులు – ఇసుక రీచ్లు సీజ్
గట్టు మండలంలో కొంతకాలంగా సాగుతున్న ఫిల్టర్ ఇసుక రీచ్లపై అధికారులు మార్చిలో దాడులు చే శారు. మండలంలోని చిన్నోనిపల్లి, బోయలగుడ్డం, లింగాపురం, చాగదోణ గ్రామాల మధ్యన వాగులు, వంకల సమీపంలో ఫిల్టర్ ఇసుక తయారీపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి రీచ్లను గుర్తించారు. తహసీల్దార్ సలీముద్దిన్, ఎస్ఐ మల్లేష్ తో పాటు ఆర్ ఐ రాజు, మిగతా పోలీస్ సిబ్బంది అడవిలో నిల్వ చేసిన రీచ్లను గుర్తించారు.
ఇసుకను ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తున్న నీటి పైపులను, ఇసుక దిబ్బలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఫిల్టర్ ఇసుక ను తయారు చేస్తున్న ట్రాక్టర్ల యాజమానులపై గుర్తించినట్లు ఎస్ఐ కేటీ మల్లేష్ తెలిపారు. జెసిబిని స్వాధీనం చేసుకొని ట్రాక్టర్ యజమాని చిన్నోనిపల్లి రమేష్ పై కేసు నమోదు చేశారు. మొత్తం 16 ట్రాక్టర్ల ఇసుక, రెండు ట్రాక్టర్ల మట్టిని సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ సలీముద్దిన్ తెలిపారు.