తెలంగాణ: Minister Seethaka: ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను కేంద్రం తక్షణం నిలిపివేయాలని మంత్రి సీతక్క కోరారు. ప్రజాభవన్లో మంత్రి తో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ- చత్తీష్ ఘడ్ సరిహద్దు కర్రెగుటల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని కోరారు.
కేంద్ర బలగాలు వేల సంఖ్యలో కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తున్నటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగారును నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారు. తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలన్నారు.
తెలంగాణ-చత్తిస్ఘడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలన్నారు. మధ్యభారతంలోని ఆదివాసి ప్రాంతాలు రాజ్యాంగం లోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయన్నారు. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయన్నారు. ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయని, అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు.
Also Read: Minister Gummidi Sandhyarani: గిరిజనులకు గుడ్ న్యూస్.. వీరికోసం ప్రత్యేక కంటైనర్ ఆసుపత్రులు!
ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలన్నారు. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నానన్నారు. ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దు అని కోరారు. ఆ జాతి బిడ్డగా ఆది వాసులకు అండగా నిలుస్తానని, ఆపరేషన్ కగార్ తో ఆదివాసీలు తీవ్రభయాందోళనతో ఉన్నారన్నారు.
మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయని స్పష్టం చేశారు. మంత్రితో భేటీ అయినవారిలో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.
Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/