BRS BJP Alliance: బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో మాజీ సీఎం కేసీఆర్ (KCR).. కాంగ్రెస్ (Congress) పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మరో ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీ (BJP) గురించి కనీసం పల్లెత్తు మాట అనకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకప్పుడు కేసీఆర్ సభ అంటే కాంగ్రెస్, బీజేపీపై సమపాళ్లలో విమర్శలు ఉండేవి. ప్రధాని మోదీ (Prime Minister Modi) రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడేవారు. తీరా రజతోత్సవ సభ (BRS Silver Jubilee Meet)లో అలాంటివేమి కనిపించకోవడంపై రాజకీయ విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ – బీజేపీ త్వరలో పొత్తు కుదుర్చుకోబోతున్నాయా? అన్న అనుమానాలు మెుదలయ్యాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు?
త్వరలోనే హైదారాబాద్ లో జీహెచ్ఎంసీ (GHMC Elections) ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ లో ఎంఐఎం (MIM)కు బాగా పట్టు ఉంది. రీసెంట్ గా జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎంఐఎం – కాంగ్రెస్ పోటీ చేయవచ్చని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. కాబట్టి బీజేపీ తరహాలో ఒంటరిగా పోటీ చేస్తే.. లోక్ సభ ఎన్నికల తరహాలోనే ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని గులాబీ దళం భావిస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెుదట జీహెచ్ఎంసీ ఎన్నికల వరకైనా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే హైదరాబాద్ లో కాస్త పట్టు సాధించవని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం సపోర్ట్ కోసం?
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అటు కేసుల పరంగా తనకు, తన ఫ్యామిలీకి రక్షణ లభిస్తుందని కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం (Kaleshwaram Project) అవకతవకలపై రోజుకో వార్త బయటకు వస్తోంది. పూర్తిస్థాయి నిపుణుల నివేదిక బయటకు వస్తే అది కేసుల పరంగా తనకు ఇబ్బంది అవుతుందని కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రం అండగా ఉంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే కుమార్తె కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liqour Scam Case) నుంచి కూడా ఉపశమనం లభించవచ్చని గులాబీ నాయకుడు భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: AP DSC Notification: డీఎస్సీపై గుడ్ న్యూస్.. 40% మార్కులు చాలు.. మంచి ఛాన్స్!
బీజేపీ ఒప్పుకుంటుందా?
బీఆర్ఎస్ – బీజేపీ ఒకటే అంటూ కాంగ్రెస్ శ్రేణులు పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ రావడం వెనక బీజేపీతో కేసీఆర్ చేసుకున్న లోపాయకారి ఒప్పందమే కారణమని ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అయితే బీజేపీ మాత్రం బీఆర్ఎస్ తో పొత్తుపై ఎదురుదాడి చేస్తూనే ఉంది. ఆ బీఆర్ఎస్ ముఖ్యనేతలైన కేసీఆర్, కేటీఆర్, కవితపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవలపై సీబీఐ ఎంక్వైరీ సైతం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పొత్తుకు స్నేహ హస్తం అందిస్తే బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి మెుదలైంది.