తెలంగాణ: Employment Guarantee Works: రాష్ట్రంలో ఉపాధిహామీ పనులు స్పీడ్ అందుకోనున్నాయి. జిల్లాల వారీగా పనులు, నిధులు, వర్క్ ప్లాన్ ను ప్రభుత్వం సిద్ధం చేసింది. అందుకు 2వేల కోట్లకు పైగా నిధులు సైతం మంజూరు చేసింది. అన్ని జిల్లాల కంటే ఎక్కువగా నల్లగొండజిల్లాకు 158.7కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఈ సారి ఉపాధి హామీలో 7 పనులను ప్రభుత్వం చేపట్టబోతోంది. పనిదినాలు పెంచాలని త్వరలోనే కేంద్రానికి లేఖ రాయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ వేసవిలో రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం కింద ఏయే పనులు చేపట్టాలనేదానిపై ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు రూపొందించింది. జిల్లాల వారీగా ఉపాధి హామీ పనులు, వర్క్ ప్లాన్ సిద్దం చేసింది. అందుకు సంబంధించిన పైలు ఆమోదం పొందింది. ఈ ఏడాది ఉపాధిహామీ పథకం కోసం రూ.2708.3కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో రూ.1625కోట్లు వేతనాలు, రూ.1083 కోట్ల మేర మెటిరీయల్ కంపోనెంట్ కోసం కేటాయించనున్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా పక్కా మానిటరింగ్ చేయబోతున్నట్లు సమాచారం. పనిదినాల టార్గెట్ ను చేరేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధిహామీ సిబ్బందికి ఆదేశాలు సైతం ఇచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఉపాధిహామీలో 7 పనులు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఈ ఏడాది పనిదినాలు కేటాయించింది. 6.5కోట్ల పని దినాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉపాధి హామీ పథకంలో మహిళా శక్తి ఉపాధి భరోసా, పొలం బాటలు, ఫల వనాలు, వనమహోత్సవం, జల నిధి, రూరల్ సానిటేషన్, మౌళిక సదుపాయాల కల్పన పనులు ప్రభుత్వం చేపట్టనుంది. వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఏపీఎం, ఏపీఓలకు ప్రభుత్వం ఆదేశించింది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. వాటిని విజయవంతం చేయాలని ఉపాధిహామీ సిబ్బందికి సూచనలు ఇచ్చింది.
నల్లగొండకు పెద్దపీట
ఉపాధిహామీ పథకం కింద చేపట్టే పనుల కోసం ప్రభుత్వం 27083కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలోని 32 జిల్లాలు ఉండగా నల్లగొండకు ప్రాధాన్యం ఇచ్చారు. నల్లగొండకు ఉపాధి పనుల కోసం 158.7కోట్లు మంజూరు చేయగా, వికారాబాద్ జిల్లాకు 140కోట్లు, సూర్యాపేట జిల్లాకు 13.1కోట్లు కేటాయించారు. అతితక్కువగా ములుగు జిల్లాకు కేటాయించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ములుగు చిన్న జిల్లా కావడంతోనే తక్కువ నిధులు కేటాయించారని, రూ.41.2కోట్లు కేటాయించింది.మేడ్చల్ జిల్లాలోని గ్రామాలు సిటీలో కలువడంతో ఉపాధి పథకం కింద నిధులు కేయించలేదు.
పనిదినాలు తగ్గించిన కేంద్రం
గతేడాది కంటే ఈ సారి కేంద్రం 1.5కోట్ల పనిదినాలు కేటాయించింది. గతేడాది 8కోట్ల పనిదినాలను కేంద్రం కేటాయించగా ఈ సారి 6.5కోట్ల పనిదినాలను మాత్రమే కేటాయించింది. ఈ పనిదినాలను బట్టి కేంద్రం నిధులు మంజూరు చేయనుంది. గతేడాది డిమాండ్ అధికంగా ఉండటంతో 12 కోట్ల పనిదినాలు పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం..అనుగుణంగా కేంద్రం అనుమతులిచ్చింది. కానీ ఈ ఏడాది కేవలం 6.5 కోట్ల పనిదినాల కేటాయింపు చేస్తూ అంతకు మించి పనులు చేయించొద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలుఇచ్చింది. తెలంగాణకే కాదు దేశ వ్యాప్తంగా ఉపాధి హమీ పనులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కూలీలకు తీవ్ర నష్టం కలుగనుంది. డిమాండ్ డ్రివెన్ గా కాకుండా..సప్లై డ్రివెన్ గా ఉపాధి హమీ పనులు కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. అవసరాలు, డిమాండ్ ను బట్టి పనిదినాలను కేంద్రం పెంచకపోతే రాష్ట్రంలో ఉపాధి తగ్గనున్నది.
కేంద్రానికి లేఖ రాసే యోచనలో మంత్రి
వ్యవసాయానికి అనుబంధంగా కొన్ని పనులను ఉపాధిహామీ పథకంలో చేపడుతున్నారు. అంతేగాకుండా వేసవిలో ఉపాధి తక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం అమలు చేస్తున్న ఉపాధిహామీ పనులకు ప్రజలు వెళ్తుంటారు. అయితే ఈసారి కేవలం 6.5కోట్ల పనులకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో గ్రామీణులకు ఉపాధి దొరకక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. గతేడాది 12కోట్ల పనిదినాలు పూర్తి చేయడంతో ఈసారి మరింత పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పనిదినాలు పెంచేలా కేంద్రానికి మంత్రి సీతక్క లేఖ రాసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉపాధికూలీలు సైతం మంత్రి చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Also Read:CM Revanth Reddy In Japan: మరో కొత్త ప్రపంచం మా దగ్గర సృష్టించండి.. రేవంత్ రెడ్డి