తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: IT Knowledge Hub: ఐటీ నాలెడ్జ్ హబ్ పుప్పాలగూడ పరిసరాల్లో సుమారు 450 ఎకరాల్లో మొదటి దశలో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఐఏఎస్ అధికారుల కోసం ప్రభుత్వం గతంలో స్థలాలు కేటాయించింది. రెవెన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ తదితర సొసైటీలకు సుమారు 200 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం కేటాయించింది.
పుప్పాలగూడ పరిధిలో సొసైటీలకు కేటాయించిన భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు సబ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ భూమికి పక్కనే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కు సంబంధించిన సుమారు 250 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లుగా అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. మొత్తంగా మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ అభివృద్ధికి సుమారు 450 ఎకరాలు అందుబాటులో ఉంది అని చెప్పారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్ ద్వారా ఐదు లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని అధికారులు మంత్రుల బృందానికి సూచించారు.
Also Read: Bhu Bharati Act: చట్టం దేశానికే ఆదర్శం.. చరిత్రలో నిలిచేలా చేశాం.. మంత్రి పోంగులేటి
కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి పాలనలో హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నాలెడ్జ్ హబ్ ఏర్పాటైంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రూపు దిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాల్లో వచ్చిన ప్రతి మార్పులో హైదరాబాద్ భాగస్వామి అయిందని, ఇప్పుడు కూడా ఐటీ రంగంలో ఏఐ టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పును హైదరాబాద్ అందిపుచ్చుకోవాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి మాట్లాడుతూ హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధిలో సుస్థిర స్థానాన్ని ఇప్పటికే సాధించిందన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదని ఆర్థికవేత్తలు స్పష్టం చేశారన్నారు. అభివృద్ధిని కొనసాగించే క్రమంలో పుప్పాలగూడలో 450 ఎకరాల్లో నాలెడ్జ్ హబ్ అభివృద్ధి చేస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న హైదరాబాద్ ప్రగతిని వేగవంతం చేయాలని సమావేశం నిర్ణయించారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/
