తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Minister Sridhar Babu: గ్లోబల్ బిజినెస్ హబ్ గా హైదరాబాద్ మారిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అందుకు అనుగుణంగానే కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ పెరిగిందని వెల్లడించారు. నానక్ రాంగూడలో యూఎస్ కు చెందిన సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన “సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్” ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ లో 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్- ఏ కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ తగ్గుతుంటే హైదరాబాద్ లో గతేడాది దేశంలోనే అత్యధికంగా 56 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదయ్యిందన్నారు. గతేడాది రిటైల్ రంగంలో 1.8 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ ను వివిధ సంస్థలు లీజుకు తీసుకున్నాయన్నారు. హైదరాబాద్ లో ఆమ్జెన్, గ్లోబల్ లాజిక్, ఎలీ లిల్లీ, మారియంట్, సిగ్నా లాంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన 355 జీసీసీలుండగా, 3లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయన్నారు. ఏడాది వ్యవధిలో 70కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయన్నారు.
హైదరాబాద్ ను జీసీసీలకు హబ్ గా మార్చడమే కాకుండా వాటిని ఇన్నోవేషన్, ఆర్అండ్ డీ, ప్రొడక్ట్ డెవలప్మెంట్ తదితర అంశాల్లో సేవలు అందించే గ్లోబల్ వాల్యూ యాడెడ్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2030 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని వివరించారు. కొందరు కావాలనే పనిగట్టుకొని పెట్టుబడులు రాకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై నమ్మకంతో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని, వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ప్రస్తుతం వెయ్యి మంది ఐటీ, డేటా నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రెండుమూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/