తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Inter results: ఇంటర్ ఫలితాల్లో గతంలో జరిగిన తప్పిదాలు మరోసారి రిపీట్ అవ్వకూడదని బోర్డు అధికారులు భావిస్తున్నారు. అలాంటి తప్పిదాలకు చెక్ పెట్టడంపై దృష్టిసారించారు. ఒకటికి రెండుసార్లు జవాబు పత్రాలను ర్యాండమ్ పద్ధతిలో చెక్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా దాదాపు పూర్తవుతునట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 25 వరకు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. దీంతో ఆలోపే ఇష్యూస్ ను గుర్తించి ఇబ్బందులకు చోటు లేకుండా ఫలితాలు వెల్లడించాలని భావిస్తున్నారు. అందుకు ఐదు స్లాట్లలో ర్యాండమ్ రీచెకింగ్ చేపడుతున్నారు.
జీరో మార్కులు వచ్చిన వారితో పాటు 25 నుంచి 34 మార్కులు వచ్చిన విద్యార్థుల జవాబు పత్రాలను మరోసారి పరిశీలించి నిర్ధారించుకోనున్నారు. ఎందుకంటే గతంలో హైదరాబాద్ కు చెందిన ఒక టాపర్ కు అన్ని సబ్జెక్టుల్లో టాప్ మార్కులు రాగా ఒక సబ్జెక్ట్ లో మాత్రం జీరో రావడం చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. దీంతో అలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో ముందుగానే బోర్డు ఈ విధానాన్ని అవలంభించి ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది.
వాల్యువేషన్ ప్రక్రియలో జరిగే తప్పులను నివారించేందుకే రీ చెక్ చేస్తున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి3 నుంచి 25 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 9.96 లక్షల మంది హాజరయ్యారు. అయితే అందరి జవాబు పత్రాలను రీచెక్ చేయడం అసాధ్యం కావడంతో ఐదు స్లాట్లను ఫ్రేమ్ వర్క్ గా చేసుకుని చేపడుతోంది. ప్రధానంగా సున్నా మార్కులు వచ్చిన వారి పత్రాలతో పాటు 95కు పైగా మార్కులు వచ్చిన వారి జవాబు పత్రాలను ర్యాండమ్ గా పరిశీలిస్తున్నారు.
Also Read: vishakha: ఆహా.. ఇది కదా పోలీస్ అంటే.. వీరు చేసిన పనికి సెల్యూట్!
అంతేకాకుండా పది లోపు మార్కులు వచ్చిన విద్యార్థులు, 25 నుంచి 35 మార్కులు వచ్చిన వారితో పాటు 60 నుంచి 70 మార్కులు వచ్చిన వారి జవాబు పత్రాలు సైతం రీచెక్ చేస్తున్నారు.తెలంగాణలో ప్రతి ఏటా పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత సుమారు 50 వేల మంది వరకు ఫీజు చెల్లించి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ ద్వారా చాలా మందికి మార్కులు కూడా యాడ్ అవుతున్న దాఖలాలు ఉన్నాయి. చాలామంది ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా రీవాల్యుయేషన్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉన్నారు.
వీటిని దృష్టిలో పెట్టుకున్న ఇంటర్ బోర్డు అధికారులు ఇలాంటి తప్పిదాలు మరసారి పునరావృతం కావద్దని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న తప్పిదాల కారణంగా సర్కార్ పై సైతం విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఫలితాలు అటు ఇటుగా రావడం వల్ల గతంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందుకే ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నాకే ఫలితాలు ప్రకటించనున్నారు. బోర్డు అధికారులు భావించినట్లుగా ఈనెల 25 లోపు ఫలితాలు అనౌన్స్ చేస్తారా? లేక డిలే అవుతుందా? అనేది చూడాలి.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/