తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: TG AICTE: ఏఐసీటీఈ గైడ్ లైన్స్ ను పాటించని పలు ప్రైవేట్ యామజమాన్యాలపై తెలంగాణ ఉన్నత విద్యామండలి యాక్షన్ ప్లాన్ కు దిగనుంది. ఆయా కాలేజీలపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఈమేరకు సంబంధిత వర్సిటీలకు ఇప్పటికే స్పష్టంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎంబీఏ, ఎంసీఏ విద్యనందిస్తున్న పలు పీజీ కాలేజీలతో పాటు ఇంజినీరింగ్ కాలేజీలపైనా విచారణ చేపట్టాలని ఉన్నత విద్యామండలి పలు వర్సిటీలకు స్పష్టంచేసినట్లు తెలిసింది.
ఏఐసీటీఈ గైడ్ లైన్స్ ను తుంగలో తొక్కిన దాదాపు 40కి పైగా ఇంజినీరింగ్ కాలేజీలపై ఆయా వర్సిటీలు ఆరా తీసే అవకాశం ఉంది. అలాగే సర్టిఫికెట్లు ఇవ్వని పీజీ కాలేజీలపైనా ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు అందడంతో వాస్తవాలు తెలుసుకోవాలని ఆయా వర్సిటీలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
తెలంగాణలో ఉన్న పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా డొనేషన్లు దండుకుంటున్నాయి. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా పలు యాజమాన్యాలు ఫ్రాడ్ ప్రాజెక్టులు, ఫీజు రీయింబర్స్ మెంట్ మిస్ యూజ్ చేస్తున్నాయి. దీంతో విద్యార్థుల్లో స్కిల్స్ డెవలప్ మెంట్ కు అవకాశం లేకుండా పోయింది. విద్యార్థులు రాకున్నా పర్వాలేదు.. కేవలం తాము మాత్రమే బాగుంటే చాలని భావిస్తున్న కాలేజీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
Also Read: Mahabubabad: మానుకోటలో నయా దందా.. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు.. అధికారుల అండదండలతో!
అందుకే విద్యార్థులకు అటెండెన్స్ తప్పనిసరి అనే నిబంధనను కూడా పలు యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు. తమకు ఫీజు వస్తే చాలనే ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఫేక్ అటెండెన్స్ ద్వారా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే ఫిర్యాదులు ఉన్నత విద్యామండలికి అందాయి. ఈనేపథ్యంలోనే చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
విద్యా వ్యవస్థలో ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా అవేం తమకు పట్టనట్లుగా ప్రైవేట్ యాజమవన్యాలు వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో దాదాపు 40కి పైగా టాప్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈ దుస్థితి ఉందనే ఫిర్యాదులు అందాయి. ఆయా కాలేజీల్లో రూ.10 లక్షలు కేవలం డొనేషన్ల పేరిట వసూళ్లు చేస్తున్నారని చెబుతున్నారు. తీరా చేరాక విద్య అయినా సరిగ్గా అందిస్తున్నారా? అంటే అదీ లేదని విద్యార్థి సంఘాల నేతలు వాపోతున్నారు.
ఇంజినీరింగ్ విద్యలో ప్రాజెక్టులు ప్రధానం. థియరిటికల్ కంటే ప్రాక్టికల్ గా ఏదైనా ప్రాజెక్టు చేస్తేనే దానిపై విద్యార్థికి పూర్తి అవగాహన సాధ్యం. అలాంటిది పలు యాజమాన్యాలు డబ్బుల కోసం ప్రాజెక్ట్ వర్క్ ను కూడా లైట్ తీసుకుని ఫ్రాడ్ కు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇకపోతే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని ప్రైవేట్ కాలేజీలపైనా కొరడా ఝుళిపించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇందులో ఎంబీఏ, ఎంసీఏతో పాటు ఇంజినీరింగ్ కాలేజీలు సైతం ఉన్నట్లు చెబుతున్నారు. మరి వచ్చే విద్యాసంవత్సరంలో అయినా ఈ ఇబ్బందులు లేకుండా అధికారులు చూస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపడుతారా? లేక ప్రైవేట్ యాజమాన్యాలకు దాసోహమై విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తారా? అనేది చూడాలి.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/